
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు
దేవస్థానానికి రూ.5.26 లక్షల ఆదాయం
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. శనికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి తిథి కలిసి రావడంతో భక్తులు అత్యధికంగా తరలివచ్చారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ప్రాతఃకాల సమయంలో అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రత్యక్షంగా భక్తుల పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా రూ.2,61,750, ఆన్లైన్, క్యూఆర్ పరోక్ష పూజా టిక్కెట్ల ద్వారా రూ.2,46,400, అన్న ప్రసాదం విరాళాల రూపంలో రూ.18,047తో మొత్తం దేవస్థానానికి రూ.5,26,197 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. స్వామివారిని వ్యవసాయ శాఖ కమిషనర్ డి.హరిత దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకం జరిపించారు.
అమరావతి ఏసీ బస్సు
సర్వీసు పునరుద్ధరణ
అమలాపురం రూరల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమలాపురం డిపో నుంచి అమరావతి ఏసీ బస్సు సర్వీసును శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్టు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. ప్రతి రోజూ అమలాపురం నుంచి హైదరాబాద్ (బీహెచ్ఈఎల్)కు వెళ్లే ఈ సర్వీసు ఇటీవల కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిందని చెప్పారు. అమలాపురం డిపో నుంచి అమరావతి 2572 ఏసీ సర్వీస్ రాత్రి 8.30కు, హైదరాబాద్లో 2573 సర్వీసు రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతాయన్నారు. సంస్థ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణ ఆంధ్రాలో
ఒక రాష్ట్ర, 49 జిల్లా అవార్డులు
అమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో 49 అవార్డులు లభించాయని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ శనివారం తెలిపారు. జిల్లాకు వచ్చిన గుర్తింపులో ప్రతి వ్యక్తి, సంస్థ, గ్రామం, పాఠశాల, ఆస్పత్రి, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆత్రేయపురం లొల్ల స్వచ్ఛ పంచాయతీకి జిల్లా స్థాయి అవార్డు లభించింది. ఉత్తమ స్వచ్ఛత హరిత అంబాసిడర్లుగా ఉండ్రాజవరపు మారేష్(దంగేరు), యార్లగడ్డ వెంకాయమ్మ(సాకుర్రు), చంద్రమల్ల చంద్రరావు (పాలతోడు), పెయ్యల వెంకట్రావు (భట్నవిల్లి), ఉత్తమ స్వచ్ఛత ఎన్జీవోగా వశిష్ట లయన్స్ క్లబ్ (అమలాపురం), ఆక్సిజన్ అసోసియేషన్ (మామిడికుదురు), సేవ్ నేచర్ మహిళా సంఘం (కేశనకుర్రు), ఉత్తమ స్వచ్ఛత యోధులుగా రేలంగి సత్య నాగేశ్వరరావు, యార్లగడ్డ సుబ్బాయమ్మ (అమలాపురం మున్సిపాలిటీ), బొట్టా సూరిబాబు, వడ్డాడి దుర్గారావు (మండపేట), వడ్డాది సత్తిబాబు (రామచంద్రపురం), స్వచ్ఛ అంగన్వాడీలుగా అమలాపురం, జొన్నాడ, మలికిపురం, మారేడుబాక, పాత గన్నవరం, స్వచ్ఛ బస్ స్టేషన్గా రామచంద్రపురం బస్ స్టేషన్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా కలెక్టరేట్–అమలాపురం, మండపేట మునిసిపాలిటీ, కొత్తపేట ఎంపీడీవో కార్యాలయం, స్వచ్ఛ పంచాయతీలుగా దంగేరు, కొమరగిరిపట్నం, పాలతోడు, శివకోడు, స్వచ్ఛ హాస్పిటల్స్గా బెండమూర్లంక పీహెచ్సీ(అల్లవరం), జీహెచ్డీ (గోపాలపురం), కొత్తపేట సీహెచ్సీ,, స్వచ్ఛ హాస్టళ్లుగా రాజోలు సోషల్ వెల్ఫేర్ (బాలికలు), రాజోలు ప్రభుత్వ బాలుర బీసీ కళాశాల హాస్టల్, స్వచ్ఛ పరిశ్రమలుగా అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ (గోపాలపురం), ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఈతకోట), స్వచ్ఛ గురుకుల పాఠశాలగా అంబేడ్కర్ బాలుర గురుకులం (గోడి), స్వచ్ఛ రైతు బజార్గా రామచంద్రపురం, స్వచ్ఛ పాఠశాలగా మడికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జీహెచ్ఎస్–కొంకపల్లి (అమలాపురం), ఎస్ఐజీ ఎంపీఎల్ సీహెచ్ఎస్ నగర్(రామచంద్రపురం), జిల్లా పరిషత్(రాయవరం), స్వచ్ఛ ఎల్ఎఫ్ఎస్గా భాను, కొత్త ఎస్సీపేట(రామచంద్రపురం), ఐశ్వర్య, అంకంవారిస్ట్రీట్(రామచంద్రపురం), స్వచ్ఛ గ్రామ సంస్థలుగా నల్లమిల్లి బండారులంక (అమలాపురం), గేదెల్లంక (ముమ్మిడివరం), కందులపాలెం(రామచంద్రపురం), శివకోడు, రాజోలు ఎంపికయ్యాయి.