
దళిత యువకుడిపై హత్యాయత్నం గర్హనీయం
నర్సీపట్నం: దళిత యువకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ బహుజన ఐక్యవేదిక, వివిధ ప్రజా సంఘాల నాయకులు స్థానిక అబిడ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు భార్య లక్ష్మి మాట్లాడుతూ పోలీసులు కేసును నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆరోపించింది. తన భర్తకు ఏమైనా అయితే కుటుంబ పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పక్కాగా తన భర్తను హత్య చేసేందుకు కత్తులు, రాడ్లుతో వస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో సరిపెట్టడం సరికాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా నాగరాజు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలాకాలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. నిందితులపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. వైజాగ్ భీమసేన కన్వీనర్ రవి సిద్దార్థ మాట్లాడుతూ మొన్న హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దళితులపై దాడి జరిగిందన్నారు. ఈ రోజు సాక్షాత్తు స్పీకర్ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై హత్యాయత్నం జరగడం శోచనీయమన్నారు. ఈ దాడులు, హత్యాయత్నాలు, హత్యలు కేవలం దళితులపై జరుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యుడు సరమండ వీరబాబు మాట్లాడుతూ దళితులు రాజకీయాలు చేస్తుంటే చంపేయాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆరుగుల్ల రాజుబాబు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా దళిత యువకుడు ఈశ్వరరావుపై దాడి జరగటం అమానుషం అన్నారు. స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ చిట్టయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్యా రాజకీయాలు ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. లోతుగా విచారణ చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ ఆందోళనలో సాల్మన్రాజు, దేముడు, నాగేశ్వరరావు, సూరిబాబు, అప్పలనాయుడు, జల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.
వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆందోళన