
‘అవినీతిపరుడు కొండనాయుడుకు పదవి ఇవ్వొద్దు’
బుచ్చెయ్యపేట: అవినీతికి పాల్పడుతున్న టీడీపీ రావికమతం మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు మళ్లీ పదవి ఇవ్వొద్దంటూ పలువురు టీడీపీ నాయకులు నిరసన గళమెత్తారు. ఈ మేరకు శుక్రవారం రావికమతం మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు వడ్డాదిలో టెంట్ వేసి రాజునాయుడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా కొండనాయుడు పార్టీ మండల అధ్యక్షుడిగా ఉంటూ అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అవినీతికి పాల్పడున్నాడన్నారు. పలు గ్రామాల్లో భూ దందాలు చేయడమే కాక అధికారుల బదిలీల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని విమర్శించారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలను బెదిరించి తాను చెప్పిన పనులు మాత్రమే చేయాలని, ఎమ్మెల్యే తరువాత సూపర్ ఎమ్మెల్యేని తానేనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. తనకు మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని, అవినీతికి పాల్పడుతూ పార్టీ పరువు తీస్తున్న కొండనాయుడు కుటుంబ సభ్యులకు ఎటువంటి పదవులు ఇవ్వొందంటూ పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు భర్నికాన అప్పారావు, వై.చినసత్తిబాబు, పి.శ్రీనుబాబు, ఎం.దేముళ్లు, పి.అప్పన్న, సిహెచ్.రాజునాయుడు, ఎస్.రాము, మలిచెట్ల నాగేశ్వరరావు, బాబూరావు తదితరులు నినాదాలు చేశారు. రాజునాయుడు అవినీతిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు, ఎమ్మెల్యే రాజుకు ఫిర్యాదు చేశారు.