Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Negligence Taken Lives Of 7 People At Simhachalam Tragedy1
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'

‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్‌ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్‌ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిప­డుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరి­స్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూ­లైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్‌ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్‌ డిజైన్‌ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియ­మించకపోవడం గమనార్హం. కేవలం ఇన్‌చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్‌చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసు­కున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్‌ వాల్‌ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్‌ వాల్‌ కాపాడేది. అయితే, ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో కొత్త రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి సమయం పడు­తుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునా­దులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్‌ స్ట్రక్చర్‌ లేకుండా కేవలం ఫ్లైయాష్‌ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్‌ వాల్‌ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్‌ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్‌ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్‌ రోడ్‌లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్‌చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షి­ణకు భక్తులు పోటెత్తు­తారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్త­రాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనో­త్సవం వేళ రెగ్యులర్‌ ఈవోను ప్రభు­త్వం నియమించలేదు. రెగ్యులర్‌ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతు­న్నారు. ఏప్రిల్‌ 30న చంద­నోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్‌ ఈవోను నియమించపో­వడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచా­రాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పా­ట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపు­చ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటన­లన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచ­లం క్షేత్రం వద్ద చోటుచేసు­కున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనో­ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్‌ విచారంఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Union Minister Ashwini Vaishnaw Reveals about Caste Census2
కులగణనకు ఓకే..

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్న కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా కులగణనను సైతం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కులగణనకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకమే కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆరోపించారు. గతంలో కులగణనను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా గణనలోనూ కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కులగణన అంశాన్ని కేబినెట్‌లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేస్తే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపాయి. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు బదులుగా సోషియో ఎకనామిక్‌ అండ్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ (ఎస్‌ఈసీసీ) సర్వే నిర్వహించాలని నిర్ణయించింది’అని మండిపడ్డారు. రాజకీయ సాధనంగా వాడుతున్నారు.. కులగణనను ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని అశి్వనీవైష్ణవ్‌ ఆరోపించారు. ‘కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను బాగానే నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను లేవనెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని సీసీపీఏ నిర్ణయించింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ వర్గానికి ఇబ్బంది కలిగించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది’అని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌చేస్తూ వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు నిర్ణయం తీసుకుందని, ఇది సంపూర్ణంగా తమ విజయమని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు పేర్కొన్నాయి. మొదట్లో అన్ని కులాల డేటా.. మనదేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటీష్‌ పాలనాకాలంలో 1881లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే.. అంటే 1881లో తొలిసారి నిర్వహించిన జనగణనలో కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీంతో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020లో నిర్వహించాల్సిన జనగణనను కోవిడ్‌–19 కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోనే కులగణనను చేర్చాలని తాజాగా నిర్ణయించింది. మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.

Rasi Phalalu: Daily Horoscope On 01-05-2025 In Telugu3
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.చవితి సా.4.22 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మృగశిర రా.7.13 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.3.19 నుండి 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: ఉ.10.55 నుండి 12.24 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం..... కుటుంబంలో చికాకులు. పనులలో విజయం. వ్యయప్రయాసలు. ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.మిథునం.... కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కర్కాటకం.. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సింహం.... వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.తుల..... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.వృశ్చికం.... బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి విషయాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు..... శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం...... కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆధ్యాత్మిక చింతన.కుంభం.. మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి.మీనం.. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశపరుస్తాయి.

Everything is ready for Operation Pahalgam4
టిక్‌.. టిక్‌... టిక్‌

న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్‌ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్‌ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్‌ మోడ్‌లోకి దిగింది. ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్‌ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ కూడా జరిగింది. అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్, ఆర్మీ చీఫ్‌ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మోదీ రష్యా పర్యటన రద్దు మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్‌ పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మన గగనతలం మూత పాక్‌ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్‌ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్‌ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.సూపర్‌ కేబినెట్‌ భేటీయే కీలకం!ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్‌ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్‌ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు. ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం. ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది.

Pakistan tightens security for most wanted Lashkar chief5
లాహోర్‌ నడిబొడ్డున సయీద్‌ అడ్డా!

హఫీజ్‌ సయీద్‌.. కరడుగట్టిన పాకిస్తాన్‌ ఉగ్రవాది. లష్కరే తోయిబా అధినేతగా భారత్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారం జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల (రూ.84.58 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్‌ సయీద్‌ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్‌ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్‌లో రెండో పెద్దనగరమైన లాహోర్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్‌ చిత్రాలను, వీడియోలను ‘ఇండియా టుడే’ వార్తాసంస్థ తాజాగా బహిర్గతం చేసింది. లాహోర్‌లో జోహర్‌ టౌన్‌ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు దాడి చేయకుండా ఎత్తుగడ అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్‌–ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్, జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి, లాడెన్‌ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండడం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చిoది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహల్వపూర్‌లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా, హఫీజ్‌ సయీద్‌ వ్యూహం మరోలా ఉండడం గమనార్హం. లాహోర్‌ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్నచోట దాడులు చేస్తే ప్రాణనష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావొచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడవచ్చు. లాహోర్‌లో హఫీజ్‌ సయీద్‌ ఇల్లు శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్‌ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతోపాటు మరికొన్ని ఇళ్లు, మసీదు, మదర్సా(హఫీజ్‌ సయీద్‌ కార్యాలయం), ఒక ప్రైవేట్‌ పార్కు ఉన్నాయి. హఫీజ్‌ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. అతడికి పాకిస్తాన్‌ సైన్యంతోపాటు సొంత ప్రైవేట్‌ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్‌ సయీద్‌ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇంటి కింద బంకర్‌ లాహోర్‌లోని అల్‌–ఖద్‌సియా మసీదు గతంలో హఫీజ్‌ సయీద్‌ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్‌లో భారత సైన్యం సర్జికల్‌ స్రైక్‌ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్‌–ఖద్‌సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్‌కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు. దాంతో హఫీజ్‌ సయీద్‌ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్‌ లోపల, బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్‌ సమీపంలోకి కూడా అనుమతించరు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడం నిషేధించారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్‌ సయీద్‌ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు ఉగ్రవాద కార్యాకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్‌ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్‌ పైకి నమ్మబలుకుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమతోంది. సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్‌ సైన్యమే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్‌ ఫోర్స్‌(టీఆర్‌ఎఫ్‌) స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక అసలు సూత్రదారి హఫీజ్‌ సయీద్‌ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరుడి కోసం కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్‌లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

YS Jagan anger over Simhachalam incident6
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్‌ గోడ (రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ వాల్‌) కట్టాల్సిన చోట ఫ్లైయాష్‌ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్‌ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతి­లో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశా­లలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్‌ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాల­మ్స్‌ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్‌ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదు­కోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్య­త తీసుకున్న మంత్రులపై, ఆల­యాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పు­డే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్‌ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వ­స్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.­25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడు­గా ఉండాలి.» ఏదైనా ప్రమా­దం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చె­ందాలి. మనం ఆ కుటు­ంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో ఒక్కొ­క్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్‌ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకు­ంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్‌ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, భీమిలి ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మె­ల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్‌ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్‌ పాలిటిక్సే. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్‌ పిల్లర్‌ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్‌జీవోస్‌ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు.

Sakshi Editorial On Modi Govt Strategy for Pakistan7
పదునైన వ్యూహంతో...

ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం. ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్‌ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే. ఒకపక్క ఎల్‌ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్‌ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్‌ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది. మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్‌ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్‌ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్‌లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్‌ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే. కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ నేతల్ని పాకిస్తాన్‌ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం.

State Home Minister Anitha reached out to the victims for signatures8
జగన్‌ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు

ఆరిలోవ/డాబాగార్డెన్స్‌: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్‌ జగన్‌ కేజీహెచ్‌ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్‌ జగన్‌ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమా­ర్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు.

Jewellery sales across the country on the occasion of Akshaya Tritiya9
అమ్మకాలు 'అక్షయం'!

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్‌లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్‌ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్‌ ఉంది’’ అని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా సీఈవో సచిన్‌ జైన్‌ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. పాత ఆభరణాల మార్పిడి.. అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్‌ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్‌ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్‌ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్‌ఐ ఇండియా ఎండీ రమిత్‌ కపూర్‌ వెల్లడించారు.దిగొచ్చిన బంగారం ధర అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేనత్‌ చైన్‌వాలా తెలిపారు.

Punjab beat Chennai Super Kings by 4 wickets10
చెన్నై ఖేల్‌ ఖతం

సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్‌ మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్‌ ‘హ్యాట్రిక్‌’...బ్యాటింగ్‌లో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్‌ కలిసి జట్టును గెలిపించారు. చెన్నై: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్‌ కరన్‌ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, బ్రెవిస్‌ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. యుజువేంద్ర చహల్‌ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు... చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్‌ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్‌ప్రీత్‌ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్‌ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్‌ చెలరేగిపోగా, బ్రెవిస్‌ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్‌ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్‌ వరుసగా 6, 6, 2 (నోబాల్‌), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్‌ సెంచరీ, సీఎస్‌కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్‌ బౌలింగ్‌లో కరన్‌ అవుట్‌ కాగా...చహల్‌ వేసిన 19వ ఓవర్‌తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది. కీలక భాగస్వామ్యాలు... పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్‌ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్‌ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో శ్రేయస్‌ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్‌ వెనుదిరిగినా...శశాంక్‌ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి శ్రేయస్‌ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్ 11; ఆయుశ్‌ (సి) శ్రేయస్‌ (బి) యాన్సెన్‌ 7; స్యామ్‌ కరన్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) యాన్సెన్‌ 88; జడేజా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) హర్‌ప్రీత్‌ 17; బ్రెవిస్‌ (బి) అజ్మతుల్లా 32; శివమ్‌ దూబే (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్ 6; ధోని (సి) వధేరా (బి) చహల్‌ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్‌ 2; కంబోజ్‌ (బి) చహల్‌ 0; నూర్‌ (సి) యాన్సెన్‌ (బి) చహల్‌ 0; ఖలీల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 190. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్‌: అర్ష్ దీప్ 3.2–0–25–2, యాన్సెన్‌ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్‌ప్రీత్‌ 2–0– 21–1, చహల్‌ 3–0–32–4, సూర్యాంశ్‌ 3–0– 40–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్‌ 23; ప్రభ్‌సిమ్రన్‌ (సి) బ్రెవిస్‌ (బి) నూర్‌ 54; శ్రేయస్‌ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్‌ (సి) బ్రెవిస్‌ (బి) జడేజా 23; ఇన్‌గ్లిస్‌ (నాటౌట్‌) 6; సూర్యాంశ్‌ (సి) నూర్‌ (బి) అహ్మద్‌ 1; యాన్సెన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్‌: ఖలీల్‌ 3.4–0–28–2, కంబోజ్‌ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్‌ 4–0–39–1, స్యామ్‌ కరన్‌ 3–0–27–0, పతిరణ 4–0–45–2. చహల్‌ ‘హ్యాట్రిక్‌’ యుజువేంద్ర చహల్‌ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వేసే అవకాశం దక్కింది. వైడ్‌తో ఓవర్‌ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్‌ చివరి మూడు బంతుల్లో వరుసగా హుడా (2), కంబోజ్‌ (0), నూర్‌ (0)లను చహల్‌ అవుట్‌ చేశాడు. ‘హ్యాట్రిక్‌’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్‌లకు కారణమైన ట్రేడ్‌ మార్క్‌ పొజిషన్‌లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చహల్‌ ‘హ్యాట్రిక్‌’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్‌లో రాజస్తాన్‌ తరఫున ఆడుతూ కోల్‌కతాపై అతను హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్‌ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్‌ మిశ్రా 3 సార్లు, యువరాజ్‌ 2 సార్లు హ్యాట్రిక్‌ సాధించారు. ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X ముంబై వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement