
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
న్యూశాయంపేట: జిల్లాలో ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, డీసీపీ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్ స్పాట్గా గుర్తించాలన్నారు. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. రోడ్డు భద్రతపై పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శిక్షణ తీసుకునేందుకు విద్యావలంటీర్లను పంపాలన్నారు. ఓవర్ లోడింగ్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లాల రవాణ శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్బాబు, ఆర్అండ్బీ అధికారి రమేశ్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఎన్హెచ్ఐఎ టీం లీడర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సహకార సంఘాల బలోపేతానికి కృషి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సంఘాలు వ్యాపార అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో కొత్త సొసైటీలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోన్రావు, తదితరులు పాల్గొన్నారు.
రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్
కలెక్టర్, సంబంధిత
అధికారులతో సమీక్ష