
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లైంగికదాడి తర్వాత హత్య చేసి, ఆభరణాలు చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... పట్టణ ముత్తెంశెట్టిపాలెం తూర్పు కాల్వ కట్ట రోడ్డులో కబేళా వంతెన నుంచి వైకుఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్పస్వామి గుడి పక్కనే తాడిపత్రి మల్లీశ్వరి (60) ఒంటరిగా నివసిస్తోంది. టిఫిన్ బండి, టీ స్టాల్, కూల్డ్రింక్ దుకాణం నిర్వహిస్తోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి టిఫిన్ బండి పనులను ప్రారంభిస్తుంటుంది. అదే సమయంలో టీ కూడా విక్రయించడంతో ఉదయాన్నే అక్కడి వారు టీ తాగేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వచ్చిన వారు మల్లీశ్వరి బయటకు రాలేదని, ఇంటి కిటికీ నుంచి చూశారు. ఇంకా మంచంపైనే ఉంది. పిలిచినా స్పందన లేకపోవడంతో ఇదే ప్రాంతంలో నివసించే ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా మల్లీశ్వరి మృతి చెంది ఉన్నట్టు గుర్తించింది.
మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు, బీరువాలోని నగలు చోరీకి గురైనట్టు తెలిసింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ వి. మల్లికార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు.
మృతిపై అనేక అనుమానాలు..
మల్లీశ్వరి మృతిపై స్థానికుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపునకు బయట గడి పెట్టి ఉండడం, విగతజీవిగా పడి ఉన్నప్పుడు శరీరంపై దుస్తులు సరిగా లేకపోవడం, ఆభరణాలు మాయమవడంతో ఆమైపె లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం ఆభరణాలు, నగదు దోచుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మల్లీశ్వరిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐ తెలిపారు.
లైంగికదాడి చేసి అనంతరం హతమార్చి ఉంటారని స్థానికుల అనుమానం

వృద్ధురాలు అనుమానాస్పద మృతి