
తాగునీటి కోసం నిరసన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని సీఐటీయూ ఖండించింది. సోమవారం యాపలదిన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు, గ్రామస్థులు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం తాగునీటిని వదిలిన తర్వాత ఇంతవరకు మళ్లీ వదలక పోవడంతో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ నాయకులు ఉల్లంఘించరాదనే నెపంతో అధికారులు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ సీఐటీయూ సంచాలకుడు వీరేష్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
యువకుడి ఆత్మహత్య
హుబ్లీ: ఓ యువకుడు దేవరగుడిహాళ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వంతెన పైనుంచి పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇక్కడి హెగ్గేరి జగదీశ్ నగర్ నివాసి అవినాష్ మోదీ (21) ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి పాత హుబ్లీ పోలీసులు వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనపరచుకుని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గోవుల తరలింపు
వాహనం పట్టివేత
హుబ్లీ: ధార్వాడ వద్ద జాతీయ రహదారిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ధార్వాడ గరగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ గోవుల రవాణా ఎక్కువైన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రమోద్ ముతాలిక్ పోలీసులను డిమాండ్ చేశారు. స్థానికులు, శ్రీరామసేన కార్యకర్తలు సదరు రహదారిలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా సదరు వాహనాన్ని అడ్డుకొని పరిశీలించారు. సరైన దాఖలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు.
వీధి కుక్కల దాడిలో
ఆవు దూడ మృతి
హొసపేటె: గంగావతి నగరంలోని జయనగర్ ప్రాంతంలో 8 నెలల వయస్సు కలిగిన ఆవు దూడను వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. వీధిలో ఉన్న ఆవులు, దూడలపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. ఇందులో 8 నెలల వయస్సు ఉన్న ఆవు దూడ గాయపడి చనిపోయింది. కాగా జయనగర, సత్యనారాయణ పేట, సిద్దికేరి, సిద్దాపుర వీధి సహా వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. అవి పిల్లలపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా నగరసభ కౌన్సిలర్లు తగిన చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆరోపించారు.
నాటి అనుభవ మంటపమే నేటి పార్లమెంట్
రాయచూరు రూరల్: 12వ శతాబ్దంలో శరణుల సమయంలో ఉన్న నాటి అనుభవ మంటపం ఆధారంగానే నేడు పార్లమెంట్ నడుస్తోందని పత్రికా సంపాదకుడు అంబన్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని మారతి నగర్లో అభయఅంజినేయ్యస్వా మి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. సాహిత్య రంగంలో ఉన్న వచనాలు, దాస సాహిత్యాలు మనందరినీ నడిపించే బాటలో ఉన్నామన్నారు. అనుభవ మంటపంలో శూన్య సింహాసనంలో అల్లమప్రభు దేవుని అధ్యక్షతన బసవేశ్వరుడి మార్గదర్శనంలో వచనాలు వివరించారు. సమాజంలో మౌఢ్యాలను, కట్టుబాట్లను, కందాచారాలను విమర్శించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హొన్నూరప్ప, షణ్మకప్ప, బసవరాజ్, మల్లికార్జున, శ్రీనివాస్, పూర్ణిమ, శివప్పలున్నారు.

తాగునీటి కోసం నిరసన

తాగునీటి కోసం నిరసన