
మామిడి రైతుల ఆశలు ఆవిరి
శ్రీనివాసపురం : మామిడి పండ్లతో ప్రజలు తీయని రుచులను ఆస్వాదిస్తుండగా వాటిని సాగు చేసే అన్నదాతలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరైన వాతావరణం అనుకూలించక మామిడి దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో మామిడి రైతుల్లో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్రంలో మామిడి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన శ్రీనివాసపురం తాలూకాలో ఈ సారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మామిడి దిగుబడి, విక్రయం పట్ల మామిడి ఉత్పత్తి దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
30 శాతమే దిగుబడి
తాలూకాలో సుమారు 59 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి పండిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మామిడి చెట్లలో పూత అధికంగా కనిపించింది. అయితే గాలి, అకాల వానలకు పూత గణనీయంగా రాలిపోయింది. ఈ సంవత్సరం కేవలం 30 శాతం దిగుబడి మాత్రమే ఉంటుందని అంటున్నారు. సాధారణంగా మే 15 నుంచి ప్రారంభమయ్యే మామిడి మార్కెట్ వ్యవహారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. తక్కువ దిగుబడి కారణంగా మార్కెట్ కేవలం రెండు నెలలకే పరిమతమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరో వైపు ధరలు కూడా ఈసారి ఆశాజనకంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఈసారి మామిడి శ్రీనివాసపురం మార్కెట్కు వచ్చే అవకాశం ఉండడం వల్ల పోటీ అధికంగా ఉంటుంది. దీని వల్ల శ్రీనివాసపురం మామిడికి మంచి ధర లభించకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
అకాల వర్షానికి పూత రాలింది
మామిడి దిగుబడి ఈసారి ఆశాజనకంగా లేదు. అకాల వానలతో చాలా వరకు పూత రాలిపోయింది. అనంతరం పిందె దశలో కురిసిన వడగళ్ల వానకు సగానికి సగం కాయలు రాలిపోయాయి. దీనికి తోడు బూడిద రోగం తదితర చీడపీడలు మామిడిని పట్టిపీడిస్తున్నాయి. దిగుబడి 30 శాతానికి పడిపోయే అవకాశం ఉంది.
రమేష్, మామిడి రైతు,
తొట్లి గ్రామం
అకాల వర్షాలతో రాలిన పూత, పిందె
ఈ ఏడాది దిగుబడి 30 శాతమే
తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు
అకాల వర్షాల దెబ్బ
రోగాల నియంత్రణకు , అధిక దిగుబడికి రైతులు , వ్యాపారులు వివిధ రకాల మందులను చల్లారు. దీనికి లక్షల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. పలువురు వ్యాపారులు ఉత్తమ దిగుబడిని ఆశించి పూత దశలోనే మామిడి తోటలను ఖరీదు చేశారు. బంపర్ లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారుల ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉంది. ఈ సారి మామిడి దిగుబడి తగ్గించదనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది రైతులు, వ్యాపారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.