
ఈసారి బసవ జయంతిని ఘనంగా ఆచరిద్దాం
బళ్లారిఅర్బన్: ఈసారి ఎటువంటి నిబంధనలు లేకుండా బసవ జయంతిని వైభవంగా జరుపుకుందామని బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వీరశైవ లింగాయత ప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బసవ జయంతి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తాను చేస్తాను. నిబంధనల గురించి పట్టించుకోవద్దు, సమాజ బాంధవుల సహకారంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి బసవ జయంతిని వైభవంగా జరుపుకుందాం అన్నారు. ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. జయంతి వేడుకల ఆచరణలో తన స్వార్థం ఏమి లేదు. బసవణ్ణను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రాయబారిగా ప్రకటించడంలో సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఘనత ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు సమాజం ఆధ్వర్యంలో కూడా జయంతి జరుపుకునే దిశలో కూడా ఆలోచించాలని సూచించారు. రూ.1.5 కోట్ల నిధులతో అశ్వారూఢ బసవణ్ణ విగ్రహాన్ని కేఈబీ సర్కిల్లో ఏర్పాటు చేద్దామని, దీనికి స్థలం ఇచ్చిన గడిగి కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కమ్మరచేడు సంస్థాన కళ్యాణ స్వామి, హరగినడోణి స్వామి సాన్నిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో అల్లం ప్రశాంత్, దండిన శివానంద, చోరనూరు కొట్రప్ప, కోరి విరుపాక్షప్ప, కరేనహళ్లి చంద్రశేఖర్, నరేంద్రబాబు, టీహెచ్ఎం గురుబసవరాజ్, డాక్టర్ మహిపాల్, అసుండి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.