
అత్యాశను వదిలిపెట్టాలి
● పిల్లలకు పొదుపు నేర్పాలి
● లోకాయుక్త ఎస్పీ స్నేహా సూచన
మండ్య: నేడు ప్రతి ఒక్క మనిషిలోను అత్యాశ ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోందని, ప్రజలు ఆశలను అదుపు చేయకపోతే ఏమీ సాధించలేరని రామనగర లోకాయుక్త ఎస్పీ పీవీ స్నేహా అన్నారు. మండ్య నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ పాత విద్యార్థుల సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లలు ఆర్థిక క్రమశిక్షణను నేర్చుకోవాలి. అది లేకుంటే డబ్బులను పొదుపు చేయడం కష్టమని అన్నారు. తల్లిదండ్రులు ఎంత సంపాదన చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, అందులో ఎంత పొదుపు చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది పిల్లలకు వివరించి జాగృతి కల్పించాలని సూచించారు. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని ఆమె వాపోయారు. నేటి తల్లిదండ్రులు పిల్లలు అడిగినంత డబ్బు ఇస్తున్నారని, వారు స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీని పాత స్నేహితులు, అధ్యాపకులు సన్మానించారు.
స్మార్ట్ మీటర్లలో అవినీతి
● లోకాయుక్తకు బీజేపీ ఫిర్యాదు
శివాజీనగర: కర్ణాటక విద్యుత్ బోర్డు (కేపీటీసీఎల్) అమర్చిన స్మార్ట్ మీటర్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై నిష్పక్షపాత తనిఖీ చేపట్టాలని బీజేపీ లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. సోమవారం బెంగళూరులో లోకాయుక్త ఎస్పీని భేటీ చేసిన ఎమ్మెల్యేలు సీ.ఎన్.అశ్వత్థనారాయణ, ఎస్.ఆర్.విశ్వనాథ్, ధీరజ్ మునిరాజు, సీ.కే.రామమూర్తి తదితర బృందం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లుంఘించి రాజశ్రీ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్ కొనుగోలు, నిర్వహణకు అధిక ధర నిర్ధారించారు, దీంతో ఎస్కాంలు, ప్రజలకు చెందిన సుమారు 15,568 కోట్ల రూపాయలు దోపిడీ అవుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ మంత్రి కే.జే.జార్జ్ ఆధ్వర్యంలో ఇంత భారీ అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.
ఇంటిని పడగొట్టిన ఏనుగులు
మైసూరు: ఇంటిలో ఉన్నవారు బంధువుల పెళ్లికి వెళ్లారు. వచ్చేలోగా ఇల్లు ధ్వంసమై ఉండడంతో ఇదెక్కడి ఘోరం అని వాపోయారు. అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు ఈ దురాగతానికి పాల్పడడంతో కుటుంబం రోడ్డుపాలైంది. ఈ సంఘటన చామరాజనగర తాలూకాలోని మూకనపాళ్య గ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి నానక్ బాయి అనే రైతు పొలంలోకి ఏనుగులు చొరబడ్డాయి. టమాటా, బీన్స్ పంటలను ఆరగించి చెల్లాచెదరు చేశాయి. అక్కడే ఉన్న నానక్బాయి ఇంటిని పడదోశాయి.
బ్యాంకు అధికారికి
రూ.5.58 లక్షల బురిడీ
మైసూరు: షేర్ల పేరుతో రూ. 5.58 లక్షలు మోసగించారు, బాధితుడు అన్ని ఆర్థిక వ్యవహారాలూ తెలిసిన బ్యాంకు అధికారి కావడం గమనార్హం. ఇతని టెలిగ్రాం యాప్కి ఓ పెద్ద సంస్థ పేరుతో మెసేజ్ వచ్చింది. తమ యాప్ ద్వారా షేర్ల కొనుగోలు చేస్తే భారీ లాభాలు వస్తాయని అందులో ఉంది. దీంతో ఆశకు పోయిన అధికారి.. చాటింగ్ ద్వారా వారిని సంప్రదించాడు. సుమారు రూ. 5.58 లక్షలను వారికి బదిలీ చేశాడు. ఆ తరువాత ఎలాంటి సమాచారం లేదు.

అత్యాశను వదిలిపెట్టాలి