
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
కస్టడీ కోరుతూ పిటిషన్
చిత్తూరు అర్బన్: చిత్తూరులో మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతించాలని కోరు తూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించా రు. ఈ మేరకు చిత్తూరులోని మూడో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయ స్థానంలో తాలూ క పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో కూటమి పార్టీకి చెందిన మహేష్, కిషోర్, హేమంత్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి, చిత్తూరు జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. నిందితుల మొబైల్ ఫోన్లలో పలువురు దంపతులు, యువతీ యవకుల ఏకాంత వీడియోలు లభించడంతో వీళ్లను విచారించాల్సి ఉందని పోలీసులు పిటిషన్ వేశారు.
ఈ క్రాప్ బుకింగ్
వేగవంతం చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఈక్రాప్ బుకింగ్ను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. చిత్తూరు మండలం, చెర్లోపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఈక్రాప్ బుకింగ్ నమోదును ఆయన మంగళవారం పరిశీలించారు. తొలుత వేరుశనగ పంట సాగును పరిశీలించారు. పంటసాగు, దిగుబడి తదితర విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ సిబ్బంది చేపడుతున్న ఈక్రాప్ బుకింగ్ను పరిశీలించారు. ఈ క్రాప్ బుకింగ్పై రైతులకు అవగాహన కల్పించి త్వరితగతినం పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మండల వ్యవసాయశాఖ అధికారి వేణు తదితరులున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ యూత్ వలంటీర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన శాఖ అధికారి ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి నేషనల్ యూత్ వలంటీర్లుగా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి గల యువతకు అవకాశం కల్పించారన్నారు. ఏడాది పాటు సమాజసేవ నిమిత్తం వలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు అర్హులన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపికయ్యే వలంటీర్లకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇస్తారన్నారు. కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9908127829లో సంప్రదించాలని ఆయన కోరారు.
వెబ్కౌన్సెలింగ్కు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మెగా డీఎస్సీలో అర్హత సాధించిన నూతన టీచర్లకు వెబ్కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సూచించిన ఖాళీల మేరకు వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. నూతన టీచర్లు శిక్షణ కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. చిత్తూరు విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీ–2తో పాటు మరికొంత సిబ్బంది విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో గత రెండు రోజులుగా వెబ్కౌన్సెలింగ్ కసరత్తు చేపడుతున్నారు. బుధవారం వెబ్కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 9, 10 తేదీల్లో వెబ్కౌన్సెలింగ్ పూర్తి చేసి ఈ నెల 13న కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా కసరత్తు నిర్వహిస్తున్నారు.