బల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపవంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించన్నుట్లు తహసీల్దార్ వివరించారు.
కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు
బాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈమేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తె కోన నీరజకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు.
నేటి నుంచి రైల్వే గేటు మూసివేత
ఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.
రైల్వే గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రైల్వే గడ్డర్ను తరచూ భారీ వాహనాలు ఢీకొంటున్నాయని, ఆ గడ్డర్ వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వాహనాల డ్రైవర్లకు అంచనా లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్ధానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన దారులు కోరుతున్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
వీసీ ఆచార్య కె గంగాధరరావు
ఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.