
బాలలకూ విచ్చలవిడిగా మద్యం సరఫరా
ఆదాయమే పరమావధి
నరసరావుపేట టౌన్: ఉజ్వలంగా వెలగాల్సిన విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ ధనదాహం, అధికారుల మామూళ్ల మత్తులో చిత్తవుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులు కక్కుర్తితో టీనేజ్ కూడా దాటని పిల్లలతో బహిరంగంగా మద్యం తాగిస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతులు లేకపోయినా.. ఏకంగా కుర్చీలు, బల్లలు వేసి పిల్లలకు మద్యం సరఫరా చేస్తూ వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు.
జీవితాలతో చెలగాటం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకెళ్లింది. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు తెరతీసింది. ఈ క్రమంలో వైన్స్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండానే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు యథేచ్ఛగా పర్మిట్ రూముల ఏర్పాటు మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న వైనం మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఆ క్రమంలో ప్రజలను మద్యానికి దూరం చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా యువత మద్యం జోలికి వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరకు మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని ఓ వైన్ షాపులో అనుమతులు లేకుండానే పర్మిట్ రూము ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండని బాలలు మద్యం తాగుతూ కనిపించారు. మైనర్లకు మద్యం విక్రయించరాదనే నిబంధనలను నిర్వాహకులు తుంగలో తొక్కారు. వీటిపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.