
తీరనున్న రహదారిద్య్రం!
పర్చూరు(చినగంజాం): ఇంకొల్లు – పర్చూరు(పాత మద్రాస్) రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ 23.88 కోట్లు మంజూరు చేసింది. ‘సాక్షి’ వరుస కథనాలతో ఆర్ అండ్బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ 22 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇంకొల్లు సినిమా హాలు సెంటర్ నుంచి పర్చూరు బొమ్మల సెంటర్ వరకు 19 కి.మీ పొడవు, 7 మీటర్ల వెడల్పు పెంచే విధంగా బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు మిత్రా కంపెనీ 2021 డిసెంబర్ 31న అగ్రిమెంట్ చేసుకుంది. ఇంకొల్లులో సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు రహదారిలోని కల్వర్టు పనులను దాదాపు పూర్తి చేశారు. మొత్తం రూ.4.50 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. అప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించే విషయంలో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపి వేశారు. దాంతో రోడ్డు నిర్మాణానికి బ్రేక్ పడింది.
కొత్త అంచనాలతో నిధులు మంజూరు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ 22 కోట్ల నిధులకు సంబంధించి పనులు నిలిచి పోవడం, కాలం గడవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. దాంతో ఆర్అండ్బీ అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి నిధులు మంజూరు అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ
పర్చూరు– ఇంకొల్లు పాత మద్రాస్ రోడ్డుకు బుధవారం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్అండ్బీ అధికారులు డీఈ నళిని, జేఈ శ్రీకాంత్, మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు షంషుద్దీన్, పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
అన్నీ గుంతలే.. అక్కడక్కడ రోడ్డు.. రహదారి దుస్థితి
రహదారి దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనం
‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన
అధికారులు, ప్రజా ప్రతినిధులు
రోడ్డు నిర్మాణానికి
రూ 23.88 కోట్లు మంజూరు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
హయాంలోనే రూ.22 కోట్లు మంజూరు
పనులు మొదలు పెట్టి రూ 4.50 కోట్ల
మేర పూర్తయిన వైనం
బిల్లులు అందక నిర్మాణ పనులు నిలిపేసిన కాంట్రాక్టర్
ఇంకొల్లు పర్చూరు రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రోడ్డుపై ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో పలువురు వాహన చోదకులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ మార్గంలో సరైన వంతెనలు, చప్టాలు లేక పోవడంతో వర్షాల సమయంలో వాగులు పొంగి రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతుంటాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పై నుంచి వస్తున్న వర్షపు నీటితో కప్పల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు సైతం ఇబ్బంది పడ్డారు. పర్చూరు నుంచి చిలకలూరి పేట, గుంటూరు, విజయవాడ, పల్నాడు మీదుగా హైదరాబాద్కు, ఇంకొల్లు నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చైన్నెలకు వెళ్లేందుకు ఈ మార్గం అనువైనది. కాగా గతంలో జాతీయ రహదారులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరక్క మునుపు ఇదే మార్గాన్ని వినియోగించేవారు. దాంతో ఈ మార్గానికి పాత మద్రాస్ రోడ్డు అనే పేరు స్థిర పడిపోయింది. రహదారి అధ్వాన పరిస్థితి, వాహనచోదకుల వెతలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది.

తీరనున్న రహదారిద్య్రం!

తీరనున్న రహదారిద్య్రం!