బహిర్భూమికి వెళ్లి ప్రాణాలు వదిలాడు | - | Sakshi
Sakshi News home page

బహిర్భూమికి వెళ్లి ప్రాణాలు వదిలాడు

May 27 2025 1:58 AM | Updated on May 27 2025 1:58 AM

బహిర్భూమికి వెళ్లి  ప్రాణాలు వదిలాడు

బహిర్భూమికి వెళ్లి ప్రాణాలు వదిలాడు

పర్చూరు(చినగంజాం): బహిర్భూమికి వెళ్లి వాగులో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సోమవారం పర్చూరు గ్రామంలోని ఇందిరా కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జొన్నలగడ్డ మోహన్‌కుమార్‌(24) సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్లాడు. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో ప్రమాదవశాత్తూ జారిపడి వాగులో మునిగి పోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. బహిర్భూమికి వెళ్లిన తన కుమారుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తండ్రి నాగరాజు అతని స్నేహితులను ఆరా తీశారు. అతడు తీసుకెళ్లిన ద్విచక్రవాహనం వాగు వద్ద ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి పరిసక ప్రాంతాలను గమనించినప్పటికీ కుమారుని జాడ కన్పించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పర్చూరు ఎస్‌ఐ మాల్యాద్రి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి వాగులో మునిగి ఉంటాడనే అనుమానంతో చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వెతికించాడు. ఏడీఎఫ్‌ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు గంటలపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట సుబ్బయ్య, షేక్‌ షారూఖ్‌, వెంకట శివాజీ, శ్రీను.. వాగులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు, కాలనీ వాసులు ఒక్కసారిగా బోరున విలపించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. చీరాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న జొన్నలగడ్డ నాగరాజుకు ఇద్దరు కుమారులు కాగా మోహన్‌కుమార్‌ పెద్ద కుమారుడు. డిగ్రీ చదువుకున్న అతనికి ఇంకా వివాహం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement