అవిశ్వాసమా...విశ్వాసమా..! | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాసమా...విశ్వాసమా..!

May 2 2025 1:35 AM | Updated on May 2 2025 1:35 AM

అవిశ్వాసమా...విశ్వాసమా..!

అవిశ్వాసమా...విశ్వాసమా..!

చీరాల: చీరాల మున్సిపల్‌ చైర్మన్‌పై జరుగుతున్న అవిశ్వాస తీర్మాన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి పదవీచ్యుతుడిని చేయాలని ఉవ్విళ్లూరుతున్న కూటమిలోని కొంతమంది కౌన్సిలర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ జంజనం శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామంతో కూటమి కౌన్సిలర్ల గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. అవిశ్వాసం పెడతారా లేక విశ్వాసం ప్రకటిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే...

2019 ఎన్నికల ముందు జంజనం శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలకడంతో ఆయన కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కౌన్సిల్‌లో 33 మంది కౌన్సిలర్లు ఉండగా వైఎస్సార్‌ సీపీకి 22 మంది, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 11 మంది, టీడీపీ నుంచి ఒకరు మాత్రమే గెలిచారు. 2024 ఎన్నికల ముందు, ఆ తరువాత 13 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడంతో టీడీపీ బలం 14కి చేరింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు.

చైర్మన్‌ కుర్చీ కోసం వ్యూహం

రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మున్సిపల్‌ చైర్మన్‌ కుర్చీని సొంత చేసుకునేందుకు కూటమి వ్యూహం రచించింది. అవిశ్వాసం తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. 14 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు, ఆమంచి వర్గం మద్దతుతో ఎలాగైనా జంజనంను చైర్మన్‌ పీఠం నుంచి దించేందుకు వ్యూహం పన్నారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళికి అందించారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్‌ గోలి జగదీష్‌, 12వ వార్డుకు చెందిన మామిడాల రాములు, 20వ వార్డుకు చెందిన శిఖాకొల్లి రామసుబ్బులు టీడీపీకి మద్దతు తెలుపగా టీడీపీ మద్దతుదారుల సంఖ్య 17కు చేరింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో సంఖ్యా బలం 22కు చేరుకుంది. ఎమ్మెల్యేతోపాటు ఎంపీ ఓట్లు కూడా ఉన్నాయి. వారితో కూడా కలిపి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యా బలం 24 ఉంది. అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు మే 14వ తేదీని కలెక్టర్‌ ఖరారు చేశారు.

జంజనం చేరికతో కూటమి కౌన్సిలర్ల ఆశలు గల్లంతు

మున్సిపల్‌ చైర్మన్‌ జంజనంను పదవి నుంచి తప్పించి ఆ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు వ్యూహం రచించిన కౌన్సిలర్లు తమకు మద్దతు పలికిన వారిని విశాఖపట్నం తరలించారు. ఓటింగ్‌ నాటికి వారిని చీరాలకు తీసుకువచ్చి ఓటింగ్‌లో నెగ్గేందుకు పథక రచన చేశారు. ఈ తరుణంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు కొంత మంది టీడీపీ నాయకులతో కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం వద్దంటూ వినతిపత్రం ఇవ్వడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారే అవిశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడడంపై సర్వత్రా చర్చ నడిచింది. ఈ వ్యవహారం సర్దుమణిగిన రెండు రోజుల్లోనే బుధవారం చైర్మన్‌ జంజనం అమరావతి సచివాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చైర్మన్‌గా తనను కొనసాగిస్తే టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జంజనం సందేశాలు పంపినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యపై ఎటువంటి వివాదాలు చేయకుండా పరోక్షంగా సఖ్యతతో మెలగడం కూడా ఇందుకు కారణం. అవిశ్వాసంపై ఓటింగ్‌కు కొద్దిరోజులు ఉండగా ఆయన పార్టీలో చేరడంతో ఇప్పటి వరకు అవిశ్వాసంపై ఊవ్విళ్లూరిన టీడీపీ కౌన్సిలర్ల వర్గానికి మింగుడుపడడం లేదు.

టీడీపీ గూటికి చేరిన మున్సిపల్‌ చైర్మన్‌ కూటమి కౌన్సిలర్ల ఆశలు గల్లంతు 14న అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిగేనా? మలుపులు తిరుగుతున్న చీరాల మున్సిపల్‌ రాజకీయం

14న అవిశ్వాసంపై ఓటింగ్‌ జరుగుతుందా?

తాజా పరిణామాలతో అవిశ్వాసంపై ఓటింగ్‌ జరుగుతుందా అనేది సందిగ్ధంలో పడింది. జంజనం పార్టీలో చేరడంతో ఆయననే కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. వైఎస్సార్‌సీపీ నుంచి చైర్మన్‌ పీఠాన్ని తప్పించేందుకు టీడీపీకి మద్దతు పలికిన ఆమంచి ఆలోచనను తిప్పికొట్టేందుకు తెర వెనుక జరుగుతున్న రాజకీయానికి జంజనం తెరదించినట్లుగా మారింది. బలనిరూపణ అనివార్యమైతే చైర్మన్‌గా జంజనంను కొనసాగిస్తారా? అనే విషయం ఎమ్మెల్యే తేల్చాల్సి ఉంది. చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న కొంత మంది కౌన్సిలర్లు జంజనం చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు వృథాగా మారాయి. విశాఖపట్నం టూర్‌ వెళ్లిన వారు తిరిగి చీరాలకు పయనమయ్యారు. జంజనం శ్రీనివాసరావు వైఎస్సార్‌ సీపీని వీడి టీడీపీలో చేరితే వైఎస్సార్‌ సీపీకి గట్టి దెబ్బ అని అందరూ భావించినా తిరిగి తిరిగి ఆ దెబ్బ తమ పార్టీకి తగులుతుందని ఊహించలేదు. ఈ మలుపుల వ్యవహారం కొద్దిరోజుల్లో ఏం జరుగుతుందోనని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement