కల్యాణం.. వైభోగమే! | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. వైభోగమే!

May 1 2025 2:06 AM | Updated on May 1 2025 2:07 AM

మే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణాలు భారీగా జరగనున్నాయి. పెళ్లంటే ఒకప్పుడు పచ్చని పందిళ్లు, ఐదారు రోజులపాటు ఇంట్లో వేడుక నడిచేది. ఇప్పుడు శుభకార్యాలూ కొత్త పుంతలు తొక్కాయి. ఇప్పుడు పెళ్లంటే వెడ్డింగ్‌ షూట్లు, కల్చరల్‌ ప్రోగ్రాములతో నిర్వహిస్తున్నారు. ముహూర్తాలతో సంబంధిత వ్యాపారాలు ఊపందుకున్నాయి.

అద్దంకి: ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం ఒక పండుగ లాంటిది. ఆ పండుగ చేసుకునే విధానాల్లో ఎన్ని కొత్త పోకడలు వచ్చినా ఆచార సంప్రదాయాలు మాత్రం మారలేదు. పెళ్లిలో తప్పకుండా భాజాభజంత్రీలు, మాంగల్యధారణ, తలంబ్రాలతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరుపుకొంటున్నారు. ఆధునిక కాలంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం పెళ్లిలోనూ చోటు సంపాదించుకుంది. డ్రోన్‌ కెమెరా షూటింగ్‌, ఫొటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, వెడ్డింగ్‌ షూట్‌, ఏసీ ఫంక్షన్‌ హాల్‌, విద్యుత్‌ సెట్టింగులు, భారీ డెకరేషన్లు ఈ రోజుల్లో పెళ్లిలో కనిపిస్తున్నాయి.

పెరిగిన ఖర్చులు

జిల్లాలోని పట్టణాల్లోని పెళ్లిళ్లు సీజన్‌ మొదలవగానే బట్టలు దుకాణాలు, పెళ్లి మండపాలు, డెకరేషన్‌ సామగ్రి, భాజాభజంత్రీలు, సెట్టింగ్‌కు సంబంధించి వాటి ధరలు భారీగా పెరిగాయి. దాంతో ఆయా రంగాల మేనేజర్లకు, కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. వేసవి కావడంతో పాటు ఇటీవల పెళ్లిళ్లకు ఏసీ కల్యాణ మంటపాలను బుక్‌ చేసుకుంటున్నారు. అన్నీ ఒకే చోట దొరుకుతుండడంతో ఏ ఇబ్బందీ ఉండదని భావిస్తున్నారు. దానికి తోడు ఏసీ కల్యాణ మండపాల్లో భారీ సెట్టింగులతో వివాహాలు చేస్తే తమ హోదాను కూడా చాటుకోవచ్చని భావిస్తున్నారు. పూల మండపాలను మిరమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాల సెట్టింగులు, బెలూన్లతో డిజైన్లు వేసి సిద్ధం చేస్తున్నారు. దీనికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వ్యయం అవుతోంది. గతంలో పట్టణాల్లో ఉండే ఈ హడావుడి ప్రస్తుతం పల్లెలకు పాకడంతో వివాహ ఖర్చులు పెరిగిపోయాయి. ఒక్కొక్క వివాహానికి క్లాత్‌ డిజైన్‌ సెట్టింగులు రూ.25 వేల నుంచి రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నారు. పూల మండపానికి రూ.25 వేల నుంచి రూ.1,75,000 కూడా వ్యయం అవుతోంది. ఎల్‌ఈడీ స్క్రీన్లు, లేజర్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే మరింత ఖర్చు పెడుతున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి వారు ఉన్నంతలో వివాహాలను ఘనంగా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.

అంతా క్యాటరింగ్‌ మయం

గతంలో ఒక వివాహం జరిగితే బంధువులు, తెలిసిన వాళ్లు వచ్చి పిండి వంటలు, భోజనాలను అవసరమైన వంటలు వండటంతోపాటు వడ్డించేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. అంతా క్యాటరింగ్‌ మయమైంది. ఆర్డర్‌ ఇస్తే చాలు క్యాటరింగ్‌ వారే భోజనాలు సహా అన్నీ వడ్డిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, బంధువుల్లో వంటావార్పు చేసేవారు తగ్గడంతో క్యాటరింగ్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వీరు ఒక్కో వేడుకకు మెనూ బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. వివాహ ముహూర్తాలు ఒకే నెలలో ఎక్కువ ఉండటంతో వస్త్ర, నగల వ్యాపారాలు కూడా ఊపందుకుంటున్నాయి.

ఈ నెలలో ముహూర్తాలు ఇవే..

మే నెలలో 2, 5, 6, 8, 15, 17, 18, 22, 24, 27, 28వ తేదీలు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అద్దంకి, చీరాల, వేమూరు, పర్చూరు, తెనాలి వంటి నగరాల్లోనే కాకుండా ఆయా పట్టణాల పరిధిలోని గ్రామాల్లోనూ వివాహ వేడుకలు 2 వేలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పెళ్లిళ్లకు అనుబంధంగా ఉండే వ్యాపారాలన్నీ పుంజుకున్నాయి.

మే నెలలో పలు శుభ ముహూర్తాలు

జిల్లాలో 2 వేల వరకు వివాహాలు జరిగే అవకాశం

వివిధ పట్టణాల్లో మండపాలకు

పెరిగిన డిమాండ్‌

ఊపందుకున్న వస్త్ర, బంగారు

విక్రయాలు

పెళ్లిళ్లకు సంబంధించిన

వ్యాపారులు బిజీ

కల్యాణం.. వైభోగమే! 1
1/1

కల్యాణం.. వైభోగమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement