breaking news
Barefoot College
-
సావ్ధాన్... ఒన్ టూ త్రీ వాక్ ఇన్ టు బేర్ఫుట్
చైతన్యం తిలోనియా... ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో చిన్న కుగ్రామం. ఆరునెలలకు ఒకసారి ప్రపంచం నలుమూలల నుంచి కొంత మంది బామ్మలు వస్తారిక్కడికి. వారంతా కాలేజ్ స్టూడెంట్స్. నిజమే... వాళ్లు బేర్ఫుట్ కాలేజ్లో చేరడానికే వస్తారు. వాళ్లలో చాలామంది స్కూలు ముఖం కూడా చూసి ఉండరు. ఏకంగా కాలేజ్లో చేరిపోవడానికి వచ్చేస్తారు. అక్షరం ముక్క రాకపోయినా... ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా... అంతా కలిసిపోతారు. అందరి లక్ష్యం ఒక్కటే. నైపుణ్యం సాధించడం... సొంతూరికి సాయపడటం! బేర్ఫుట్ కాలేజ్లో చేరిన మహిళలు ఆరు నెలల్లో ఇంజినీర్లు అవుతారు. వారిలో కొందరు తమ గ్రామంలో చీకటిని తరిమి వెలుగులు నింపడానికి సోలార్ లైట్ తయారీ నేర్చుకుంటారు. ఇంకొందరు చుక్క చుక్క వాననీటిని ఒడిసిపడతారు. మరికొందరు భావితరాలను అక్షర సైనికులుగా తీర్చిదిద్దే గురువులు అవుతారు. ఇంకా... ఎలక్ట్రీషియన్లు, డెంటిస్ట్లు, హస్తకళాకారులుగా ఎదుగుతారు. ఆశ్చర్యంగా ఉంటే ముక్కున వేలేసుకోవడం తప్ప మనం మరేమీ చేయలేం. గ్రామీణుల నైపుణ్యమే పెట్టుబడి... బేర్ఫుట్ కాలేజీ... ఇతర కాలేజీల మాదిరి చదువు చెప్పదు. సర్టిఫికెట్లు ఇవ్వదు. పల్లెటూళ్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఆ గ్రామాల్లోని నిరక్షర నిపుణులే పెట్టుబడిగా బతుకును సాఫీగా మార్చుకునేందుకు అవసరమైన సాధన సంపత్తిని అందిస్తుంది అంతే. ‘‘బేర్ఫుట్ కాలేజీని 12 మంది తిలోనియా గ్రామ మేస్త్రీలే కట్టారన్నా... ముప్ఫై ఏళ్ల క్రితమే ఈ కాలేజీ మొత్తం సౌరశక్తితోనే నడిచిందన్నా... ఐదేళ్ల కరవును సైతం తట్టుకునేలా దీంట్లో నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యమున్న వాననీటి సంరక్షణ ట్యాంకు ఉందన్నా.. అంతా ఈ ఫిలాసఫీ చలవే. అందుకే ఈ కాలేజీలో చేరేందుకు డిగ్రీలు అస్సలు పనికిరావు. మీ చేతులతో పనిచేయాలి... మీ పల్లె లేదా మీ చుట్టూ ఉన్న వారి సమస్యల్లో ఏదో ఒకదానికి పరిష్కారం చూపగలగాలి. అన్నింటికీ మించి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటేనే బేర్ఫుట్ కాలేజీలోకి ప్రవేశం. ఒకవేళ మీరు ఇంకెక్కడో పెద్దపెద్ద చదువులు చదువుకుని సామాజిక ప్రయోజనమున్న ఆలోచనలకు పదును పెట్టాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా రావచ్చు... ఎంతకాలమైనా మాతో ఉండవచ్చు’’ అంటారు బంకర్ రాయ్. ఎవరీ బంకర్! స్వాతంత్య్రానికి రెండేళ్ల ముందు ఆగస్టు రెండున వెస్ట్ బెంగాల్లోని బర్న్పూర్లోని సంపన్న కుటుంబంలో జన్మించాడు సంజిత్ బంకర్ రాయ్. డూన్ స్కూల్లో చదువుకున్నాడు. 1962 తరువాత ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు. స్క్వాష్లో జాతీయ ఛాంపియన్ కూడా. అనుకోవాలేగానీ... ఓ డాక్టర్, ఓ సైంటిస్ట్, ఓ దౌత్యవేత్త.. ఇలా ఏమైనా కాగలిగేవాడు. చదువు పూర్తయిన తరువాత ఆయనకు కొద్దిరోజులు పల్లెటూళ్లో గడిపితే ఎలా ఉంటుంది... అనే చిత్రమైన కోరిక కలిగింది. అంతే... బీహార్కు పయనమయ్యాడు. అప్పటికి అంటే 1965కి బీహార్ మహా కరవు రక్కసి కోరల్లో విలవిల్లాడి... జీవచ్ఛవంలా ఉంది. ఆ గ్రామాలను దగ్గర నుంచి చూశాడు. పల్లెటూరి సమస్యలేమిటో? ఎలా ఉంటాయో? గ్రామీణులు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉంటారో అర్థమైంది. వెనుదిరిగి రావడమే తడవు.. తాను పల్లెబాట పట్టబోతున్నట్లు ఇంట్లో ప్రకటించేశాడీ శ్రీమంతుడు. తల్లి బిత్తరపోయింది.. వీడికేమైనా పిచ్చెక్కిందా? అనేసింది కూడా. బంకర్ రాయ్ చాలా సింపుల్గా ‘‘మీరు చెప్పించిన చదువు నన్ను ఆలోచించేలా చేసిందమ్మా. అందుకే మన పల్లెటూళ్లకు నాదైన రీతిలో సేవ చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘ఏం చేస్తావక్కడ? ఏముంది? ఉద్యోగం లేదు... డబ్బులు ఉండవు.. పూట గడుస్తుందన్న నమ్మకం కూడా లేదు కదా’’ అని అమ్మ అంటే... ‘‘ ఏమీ చేతకాకపోతే బావులు తవ్వుతా’’ అన్నాడు సినీఫక్కీలో బంకర్ రాయ్. అనడమే కాదు... అన్నంత పనీ చేశాడు. ఆ పని చేసింది రాజస్థాన్లోని తిలోనియా గ్రామంలో. దాదాపు వంద గ్రామాల్లో కరవు పరిస్థితులను అధ్యయనం చేసిన ఆయన ముందుగా తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నడుం బిగించాడు. ఈ నేపథ్యంలోనే 1972లో ప్రారంభమైంది బేర్ఫుట్ కాలేజీ!!! తొలి ఇంజనీర్ బామ్మ! బేర్ఫుట్ కాలేజీ రాజస్థాన్లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం మొదలైనప్పటికీ కాలక్రమంలో దీని పంథా మారిపోయింది. మహిళల స్వావలంబన మొదలుకొని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో తనవంతు సహకారం అందిస్తోంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాదేశాల్లోని మారుమూల ప్రాంతాల బామ్మలకు మాత్రమే ఈ కాలేజీలో ప్రవేశం. ⇒సౌరశక్తితో పనిచేసే దీపాలు, వేడినీటియంత్రాల తయారీలో వీరికి శిక్షణ ఇస్తారు. తిలోనియాలో బేరఫుట్ కాలేజీ మొత్తానికి సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసిన నిరక్షరాస్య ఇంజినీర్ ఒకరు వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ తరువాత ఈ బామ్మలు వారి వారి స్వస్థలాల్లో సోలార్ లైట్లు, ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా... మరింత మందికి శిక్షణ ఇస్తారు. ⇒వాన నీటి సంరక్షణ మెళకువలు, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ, యంత్రాల తయారీలోనూ ఇదే తరహా తర్ఫీదు లభిస్తుందిక్కడ. ⇒చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనకూ, సామాజిక దురాచారాల నిర్మూలనలపై కూడా బేర్ఫుట్ కాలేజీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారు. తిలోనియాలో శిక్షణ పూర్తి చేసుకన్న తొలి సోలార్ ఇంజినీర్ కనకా దేవి. 1997 డిసెంబరులో కాలేజ్లో చేరింది. ఇప్పటివరకూ బేర్ఫుట్ కాలేజీ దాదాపు 77 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని సోలార్ ఇంజినీర్లుగా తీర్చిదిద్దింది. అవార్డు వద్దు! బహుమతి వద్దు!! ‘‘నిరుపయోగంగా ఉన్న క్షయవ్యాధి కేంద్రాన్ని నెలకు రూపాయికి అద్దెకు తీసుకున్నాం. అలా మొదలైన బేర్ఫుట్ కాలేజీకి 2002లో ఆగాఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. ట్రస్ట్ తరఫున కాలేజీని సందర్శించిన వారు దీన్ని కట్టింది మా ఊరి మేస్త్రీలే, ఈ కాలేజ్లో పని నేర్చుకున్న వారేనంటే వాళ్లు అస్సలు నమ్మలేదు. ఆర్కిటెక్ట్లు బ్లూప్రింట్ మాత్రమే ఇచ్చారు... నిర్మాణం మొత్తం మా మేస్త్రీలే చేశారు. వారికి నమ్మకం కలగకపోవడంతో ఆ అవార్డును తిరస్కరించాం. నగదు బహుమతి 50 వేల డాలర్లను తిరిగి ఇచ్చేశాం’’ – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ఓ ఆశయం...ఊళ్లనువెలిగిస్తోంది!
రాజస్థాన్లోని ‘బేర్ఫుట్ కాలేజ్’... పేరుకి అది ఓ విద్యాలయం. కానీ అక్కడివారి మాటల్లో చెప్పాలంటే అదో దేవాలయం. అన్ని రకాలుగా వెనుకబడిన గ్రామీణులకు జీవన విధానాలను నేర్పాలన్న ఓ మహనీయుడి ఆశయానికి రూపం. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వందల గ్రామాల రూపురేఖలు మార్చి, కొన్ని వేలమంది జీవన ప్రమాణాలను పెంచిన ఆదర్శనిలయం! ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా మొదట పల్లెసీమలు అభివృద్ధి చెందాలి అన్నది చాలామంది మహామహుల అభిప్రాయం. ముఖ్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ భారతం గురించి కలలు కన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పారు. గాంధీ అభిమాని ఒకరు ఆయన కలలను నిజం చేయాలని అనుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, గ్రామీణుల జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా రాజస్థాన్లోని తిలోనియ గ్రామంలో ‘బేర్ఫుట్ కాలేజ్’ని స్థాపించారు. ఆయన పేరు... సంజిత్ బంకర్ రాయ్. చిన్ని మొలక మహావృక్షమైందిలా... ‘బేర్ఫుట్ కాలేజ్’ స్థాపన వెనుక రాయ్ ఆలోచనలున్నాయి. ఆశయాలున్నాయి. ఆయన కృషి ఉంది. కఠోర శ్రమ ఉంది. ఉన్నత విద్యావంతుడైన రాయ్... గాంధీ మెథడాలజీని బాగా వంటబట్టించుకున్నారు. అందుకే ఆయన దృష్టి ఎప్పుడూ గ్రామాల మీద ఉండేది. ముఖ్యంగా నీటి కొరతతో గ్రామాలు అల్లాడటం ఆయనను కదిలించింది. రాజస్థాన్లాంటి ఎడారి ప్రాంతం పరిస్థితి మరింత దయనీయంగా ఉండటం గమనించిన ఆయన 1972లో అక్కడ ఓ రీసెర్చ్ సెంటర్ని స్థాపించారు. నీటి సమస్య తీరాలంటే ఏం చేయాలి, ఎంతమంది ప్రజలకు ఎంత నీటిని అందిస్తే పరిష్కారం లభిస్తుంది... వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధించారు. కొన్ని పరిష్కార మార్గాలను కనుగొన్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకు గ్రామాల మీద పూర్తి అవగాహన వచ్చింది. కేవలం నీటి సమస్యలే కాదు... కరెంటు, జీవనభృతి వంటి పలు సమస్యలు గ్రామీణుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చడాన్ని గుర్తించారాయన. వాటన్నిటినీ ఏ ఒక్కరో తీర్చడం కాదు... గ్రామాల్లోని ప్రజలే తమ సమస్యలను పరిష్కరించుకునేలా చేయాలి అనుకున్నారు. అందుకు వారికి పలు అంశాల్లో తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నారు. అప్పుడే తన రీసెర్చ్ సెంటర్ని ‘బేర్ఫుట్ కాలేజ్’గా మార్చారు. చిన్నగా మొలకెత్తిన ఆ సంస్థ మహా వృక్షంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. పేరు వెనుక పెద్ద కథే ఉంది... సంస్థను స్థాపించాలనుకున్న మరుక్షణమే ఏం పేరు పెట్టాలా అని ఆలోచించారు రాయ్. చాలారోజుల మథనం తర్వాత ‘బేర్ఫుట్ కాలేజ్’ అన్న పేరును ఖరారు చేశారు. పాదం నడక సాగిస్తేనే పయనం సాఫల్యమౌతుంది. జీవితం ఓ ఒడ్డుకు చేరుతుంది. అందుకే తన సంస్థకు పాదాన్నే పేరుగా (ఫుట్) నిర్ణయించారు రాయ్. అయితే ‘బేర్ఫుట్’ అని ఎందుకన్నారంటే... గ్రామాల్లో చాలామంది చెప్పులు వేసుకోరు. వట్టి పాదాలతోనే మట్టిలో నడక సాగిస్తారు. తాను సంస్థను స్థాపిస్తున్నది గ్రామీణుల కోసమే కాబట్టి ‘బేర్ఫుట్’ అని పేరు పెట్టారు. వయసుతో సంబంధం లేకుండా అందరినీ విద్యార్థులుగా మార్చి పాఠాలు నేర్పుతుంది కాబట్టి ‘బేర్ఫుట్ కాలేజ్’ అన్నారు. పల్లెల్లో అక్షరాస్యతను పెంపొందించడం, తాగు నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, పేద పిల్లలకు ఉచిత విద్య, పెద్దవారికి వృత్తి విద్యల్లో తర్ఫీదు... ఇలా ఒకటీ రెండూ కాదు, ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందీ సంస్థ. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎందరో నిపుణులు ఇక్కడ శిక్షణనిస్తున్నారు. ఎన్నో వేలమంది ఇక్కడ విద్యాబోధన, ఇంజినీరింగ్ వర్క, అకౌంట్స్ మేనేజ్మెంట్, బొమ్మల తయారీ, కంప్యూటర్స, కమ్యూనికేషన్స వంటి పలు అంశాల్లో తర్ఫీదునొంది, పలుచోట్ల జీవనోపాధిని పొందారు. తమ కుటుంబాలను కాపాడుకుంటూ, తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఆనందంగా జీవితాలను సాగిస్తున్నారు. రాయ్ చేసినవాటిలో చెప్పుకోవాల్సింది మరొకటుంది. గ్రామాల్లో విద్యుత్ కొరత అధికంగా ఉంటుంది. కొన్ని ఊళ్లకైతే ఇప్పటికీ విద్యుత్ లేదు. అలాంటి చోట్ల సౌర విద్యుత్ని వినియోగించుకునే విధానాన్ని ప్రచారం చేశారు రాయ్. దాంతో పలు గ్రామాలు సౌరవిద్యుత్తో వెలుగులు నింపుకున్నాయి. బేర్ఫుట్ అనేది ఓ సంస్థ కాదు... ఓ ఉన్నత ఆశయం. ఓ గొప్ప దృక్పథం. అందుకే అది అంతమంది జీవితాలకు దారి చూపిస్తోంది. అన్ని గ్రామాల్లో వెలుగులు నింపుతోంది. గ్రామీణ భారతాన్ని వెలిగిస్తోంది! సంజిత్ రాయ్ సామాజిక సేవకుడే కాదు... మంచి స్క్వాష్ క్రీడాకారుడు కూడా. పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం పాల్గొన్నారు. 1970లో ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణను పెళ్లాడారు. 2010లో టైమ్స్వారి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు రాయ్. -
మలాల, రాయ్లకు 'క్లింటన్' పురస్కారాలు
భారతీయ పర్యావరణవేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్లో బాలికల విద్యపై తాలిబన్లను సైతం ఎదిరించిన మలాల యూసఫ్ జాయ్లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సుకు ఎంపికయ్యారు. న్యూయార్క్లో రేపు జరగనున్న క్లింటన్ గ్లోబల్ ఇన్షియేటివ్ వార్షిక సమావేశంలో బంకర్ రాయ్, మలాలలు ఆ అవార్డ్సు స్వీకరించనున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం భారతీయుడు రాయ్ బేర్పూట్ కాలేజీని స్థాపించారు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గ్లోబల్ సిటిజన్స్ అవార్డ్సు కమిటీ కొనియాడింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల పల్లె ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాల రూపకల్పనలో ఆ సంస్ధ పాటుపడుతున్న తీరు నభూతోనభవిష్యత్తు అంటూ కిర్తీంచింది. వర్షం నీటిని నిల్వ చేసి మంచినీటి మార్చి ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది పాఠశాల విద్యార్థులకు అందజేసిన తీరు ఆ సంస్థ సమాజసేవకు పాటుపడుతున్న తీరుకు ఓ నిదర్శనమని పేర్కొంది. ప్లానెట్ను రక్షించే 50 మంది ప్రపంచ పర్యావరణవేత్తల జాబితాలో గార్డియన్ పత్రిక రూపొందించిన జాబితాలో రాయ్ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచంలోని ప్రజలను అత్యంత ప్రభావితం చేసే 100 మంది వ్యక్తుల్లో రాయ్ కూడా ఉన్నట్లు టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. రేపు జరగనున్న ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులుల, పౌర సమాజ ప్రతినిధిలు, హాజరుకానున్నారు. 2007లో స్థాపించిన క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్ను స్థాపించారు. ప్రపంచంలోని వివిధ సమస్యలను దర్శనికతతో పరిష్కరించడమే కాకుండా అరుదైన ప్రతిభ పాటవాల ద్వారా నాయకత్వ లక్షణాలు కలిగిన వారి కోసం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.