
విజయ్ బర్త్డేకు సిద్ధం కండి
● కేడర్కు భుస్సీ ఆనంద్ లేఖ ● జూలై నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా
సాక్షి, చైన్నె: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ జూలై నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఈనెల 22న ఆయన బర్త్డే తర్వాత రాజకీయంగా కీలక ప్రకటనలు, కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. ఇందులోభాగంగా ఆయన బర్త్డేకు సన్నద్ధం కావాలని కేడర్కు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావంతో ప్రజల్లోకి ఒకటి రెండుసార్లు మాత్రమే విజయ్ బయటకు వచ్చారు. పరందూరు విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తన మద్దతు తెలియజేయడానికి బయటకు వచ్చారు. ఆ తర్వాత కోయంబత్తూరులో జరిగిన బూత్ కమిటీ మహానాడు, మదురై మీదుగా కొడైకెనాల్కు జనగనాయగం చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా అభిమానులు ఆయనకు నీరాజనాలు పలికారు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ రూపురేఖలు అంటూ ముందుకు సాగిన విజయ్ ప్రస్తుతం పది, ప్లస్టూలో టాపర్లుగా నిలిచిన వారిని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసి సత్కరిస్తున్నారు. తొలి విడత కార్యక్రమం గత నెలాఖరులో జరిగింది. బుధవారం మలి విడత కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. మహాబలిపురంలో 500 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవనున్నారు. అదేసమయంలో జననాయగంకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముగియడంతో జూలై నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 22న విజయ్ బర్త్డేను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామనా సేవలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. విజయ్ బర్త్డేకు సిద్ధం కావాలని, సేవలకు ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ ప్రధాన భుస్సీ ఆనంద్ లేఖ రాయడం గమనార్హం. తన 51వ బర్త్డే వేళ విజయ్ రాజకీయ పర్యటనలు, ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లే దిశగా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.