
వానియంబాడిలో డెంటల్ ఆస్పత్రి సీజ్
వేలూరు: వానియంబాడిలో ఓ డెంటల్ ఆస్పత్రిని సీజ్ చేశారు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి కచ్చేరి రోడ్డులో డెంటల్ ఆస్పత్రిని అరివరసన్ నడుపుతున్నాడు. గత 2023వ సంవత్సరంలో ఇతని వద్ద పలువురు చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందిన న్యూటౌన్ ప్రాంతానికి చెందిన ఇంద్రాని, వరదన్, కోనమేడు గ్రామానికి చెందిన నర్మదలతో పాటు ఎనిమిది మంది అనారోగ్యం కారణంగా మృతిచెందినట్లు తెలసింది. దీనిపై ప్రయివేటు డెంటల్ ఆస్పత్రిని తిరుపత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనాక్షి, వానియంబాడి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి శివసుబ్రమణ్యం నేరుగా వెళ్లి విచారణ జరిపారు. అధికారులు డాక్టర్ అరివరసన్ను నిలదీయగా ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరిగిన విషయమని, ఇది తనకు తెలియదన్నారు. పంటి నొప్పితో ఆస్పత్రిలో వచ్చే వారికి సరైన చికిత్స చేయకపోవడంతోనే మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటిపై ఆరోగ్యశాఖ అధికారులకు పూర్తి నివేదికను అందజేసి పోలీసుల బందోబస్తు నడుమ డెంటల్ ఆస్పత్రిని సీజ్ చేశారు.