
శివగిరిలో వృద్ధ దంపతుల హత్య
● 12 సవర్ల నగలు దోపిడీ ● 8 బృందాలుగా పోలీసుల దర్యాప్తు
సేలం: ఈరోడ్ జిల్లా శివగిరి సమీపంలోని ఎస్టేట్ ఇంట్లో ఒంటరిగా నివశిస్తున్న వృద్ధ దంపతుల హత్య కేసులో హంతకులను పట్టుకోవడానికి పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
వృద్ధ దంపతుల హత్య
ఈరోడ్ జిల్లా శివగిరి సమీపంలోని విలంగట్టువలసు మేఘరాయన్ ఎస్టేట్కు చెందిన వ్యక్తి రామసామి(75). ఆయన భార్య భాగ్యం(65). వారికి కవిశంకర్ అనే కుమారుడు, భానుమతి అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు కవిశంకర్ ముత్తూరులో మోటార్ సైకిల్ డీలర్షిప్ నడుపుతున్నాడు. కుమార్తె భానుమతికి వివాహమై ముత్తూరు సమీపంలోని శంకరపాళయంలో భర్తతో కలిసి ఉంటోంది. రామసామి తన భార్య భాగ్యంతో కలిసి తోట ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రామసామి ప్రతిరోజూ తన కొడుకు, కూతురితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. అయితే గత 4 రోజులుగా వారు ఎవరికీ ఫోన్ చేయకపోగా, ఇంటిని వదిలి బయటకు రాలేదని సమాచారం. ఈ పరిస్థితిలో కవిశంకర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినా కానీ వారు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి మేఘరాయన్ ఎస్టేట్ ప్రాంతంలో నివశిస్తున్న తన బంధువులకు ఫోన్ చేసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి తనకు ఫోన్ చేయాలని కోరాడు. దీంతో కవిశంకర్ బంధువులు నదియా, నల్లశివం శుక్రవారం రామసామి ఇంటికి వెళ్లారు. అప్పుడు అక్కడ ఇంటి ముందు రామసామి, ఇంటి లోపల భాగ్యం హత్యకు గురై మృతదేహాలుగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి గురయ్యారు. వారి మృతదేహాలు కుళ్లిన స్థితిలో దుర్వాసన వస్తుండడంతో వారు హత్యకు గురై నాలుగు రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసులు సందేహిస్తున్నారు.
12 సవర్ల నగలు దోపిడీ
సమాచారం అందుకున్న వెంటనే శివగిరి పోలీసులు, ఐజీ సెంథిల్ కుమార్, డీఐజీ శశి మోహన్, ఈరోడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుజాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో 7 సవర్ల తాళి చైన్, 5 సవర్ల బ్రేస్లెట్, ఉంగరం సహా 12 సవర్ల బంగారు నగలు దొంగిలించబడినట్లు తేలింది. హత్య జరిగిన ప్రాంతం ఒకటే విడిగా ఉన్న తోట ఇల్లు. దీనికి దగ్గరగా వేరే ఇళ్లు లేవు. కొంచెం దూరంలో ఇళ్లు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని రహస్య ముఠా తమ ప్రణాళికలను అమలు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. రామసామి ఇంట్లో కూడా రక్తపు మరకలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్య నగల కోసమే జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎనిమిది బృందాల దర్యాప్తు
హంతకులను పట్టుకోవడానికి ఏడీఎస్పీ వివేకానందం నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులు అక్కడికి చుట్టుపక్కల ఉన్న కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. తోట ఇంట్లో ఒంటరిగా నివశిస్తున్న వృద్ధ దంపతుల హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
సీన్ రిపీట్
ఇదేవిధంగా కొన్ని నెలల క్రితం తిరుపూర్లోని ఒక తోట ఇంట్లో ఒంటరిగా నివశిస్తున్న వృద్ధ జంటను ఒక రహస్య ముఠా హత్య చేసింది. అప్పుడు కూడా నగలు దోపిడీకి గురయ్యాయి. ఆ కేసులో నిందితులు ఇంకా దొరకలేదు. ఇప్పుడు అదే విధంగా ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులు హత్యకు గురికావడం భయాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి తీవ్రంగా ఖండించారు. ఇదేనా డీఎంకే పాలన అంటూ ఎద్దేవా చేశారు. పీఎంకే నేత అన్బుమణి కూడా ఈ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు.

శివగిరిలో వృద్ధ దంపతుల హత్య

శివగిరిలో వృద్ధ దంపతుల హత్య