
గర్భిణుల కోసం బయోసెన్సార్
– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణ
సాక్షి,చైన్నె: గర్భిణుల్లో ప్రీ–ఎక్లంప్సియాను పరీక్షించడానికి కొత్త బయోసెన్సార్ ప్లాట్ఫామ్ను ఐఐటీ మద్రాస్ నేతృత్వంలోని మల్టీ ఇన్స్టిట్యూట్ పరిశోధన బృందం అభివృద్ధి చేసింది. ప్రసవంలో సంభవించే ప్రాణాంతక సమస్య అయిన ప్రీ–ఎక్లాంప్సియా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గర్భిణులు, నవజాత శిశువులను ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధనలలో వెలుగు చూశాయి. ఈ బారిన పడ్డ వారికి సకాలంలో చికిత్స కోసం ప్రారంభ దశలోనే వేగవంతమైన, ఆన్–సైట్, సరసమైన స్క్రీనింగ్ అవసరం అని గుర్తించి ఈ ప్లాట్ ఫామ్ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న సాంకేతికతలకు ప్రత్యామ్నాయంగా ఫైబర్ ఆప్టిక్స్ సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి పాయింట్–ఆఫ్–కేర్(పీఓసీ) పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ఎక్కువగా మారుమూల ప్రాంతాలకు, వనరులు పరిమితంగా ఉన్న ప్రదేశాలకు అందుబాటులో ఉండదదని పేర్కొన్నారు. ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణ కోసం 3 లక్షణాలతో (సున్నితత్వం, విశిష్టత, వేగం) సులభంగా అందుబాటులో ఉండే, పాయింట్–ఆఫ్–కేర్ పరీక్షా పరికరం తక్షణ అవసరంగా భావించి పరిశోధన బృందం దృష్టి పెట్టింది. ఐఐటీ మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ వి.వి. రాఘవేంద్ర సాయి, డాక్టర్ రతన్ కుమార్ చౌదరి, ఐఐటీ మద్రాస్లోని బయోటెక్నాలజీ విభాగం డాక్టర్ నారాయణన్ మాడబూసి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ నానో బయోటెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సతీజ, వెల్లూరులోని శ్రీ నారాయణి హాస్పిటల్ – రీసెర్చ్ సెంటర్లోని శ్రీ శక్తి అమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ డాక్టర్ బాలాజీ నందగోపాల్ , డాక్టర్ రాంప్రసాద్ శ్రీనివాసన్లు ఈ ప్లాట్ ఫామ్ అభివృద్ధి చేసిన పరిశోధన బృందంలో ఉన్నారు.
నిర్ధారణ సులభతరం
ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణకు ఉపయోగించే యాంజియోజెనిక్ బ్లడ్ బయోమార్కర్ ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ (పీఐజీఎఫ్) అనే కీలక ఫలితాలను హైలైట్ చేస్తూ ఐఐటీ మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన బయోసెన్సర్స్ లాబొరేటరీ ప్రొఫెసర్ వీవీ రాఘవేంద్ర సాయి స్థానికంగా సోమవారం వివరించారు. ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణకు ఉపయోగించే యాంజియోజెనిక్ బ్లడ్ బయోమార్కర్ ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్, పాలీమైథెల్ మెథాక్రిలేట్ ఆధారిత –బెంట్ పాలీమెరిక్ ఆప్టికల్ ఫైబర్ సెన్సార్ ప్రోబ్లను ఉపయోగించి ఫెమ్టోమోలార్ స్థాయిలో పీఐజీఎఫ్ను గుర్తించడానికి ప్లాస్మోనిక్ ఫైబర్ ఆప్టిక్ అబ్సార్బెన్స్ బయోసెన్సర్ సాంకేతికతను రూపొందించామన్నారు. అయితే, ప్రీ–ఎక్లంప్సియా ఉన్న మహిళల విషయంలో 28 వారాల గర్భధారణ తర్వాత ఇది 2 నుంచి 3 రెట్లు తగ్గుతుందన్నారు. తమ పరిశోధన బృందం అభివృద్ధి చేసిన పీఓఎఫ్ సెన్సార్ ప్రోబ్లు పీ అండ్ ఏబీ వ్యూహాన్ని ఉపయోగించి 30 నిమిషాలలో పీఐజీఎఫ్ను కొలవగలవు అని వివరించారు.