
బదిలీల్లో ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో అధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్టీఏ ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలకు చేసిన చట్టం అధికారులకు చుట్టం అయ్యిందే తప్ప ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న ప్రతి పూటకో నిర్ణయం వివాదంగా ఉందన్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్స్ 196 మంది బదిలీకి దరఖాస్తు చేసుకుని పీఎస్హెచ్ఎంగా వెళ్లాలని, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, విడో, విడాకులు తీసుకున్న మహిళలపై దుర్మార్గ నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతర తెలుగు మాధ్యమం లేకుండా చేయడం అన్యాయమన్నారు. విద్యార్థి నిష్పత్తి 1:40 కాకుండా 1:49 చేసి మిగులు టీచర్లను ప్రాథమిక బడులకు తరలించడం పద్ధతి కాదని విమర్శించారు. చట్టంలోని నియమ, నిబంధనలను పాటించకుండా టీచర్ల వ్యతిరేక విధానాలతో 6304 మంది ఎస్జీటీలు ఉద్యోగోన్నతికి నోచుకోక నష్టపోయారన్నారు.