
జోరుగా ఇసుక అక్రమ రవాణా
సాసాక్షి టాస్క్ఫోర్స్ : తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య టీడీపీ నేత కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ములకలచెరువుకు చెందిన ఈ కీలక నేత ఆదేశాలతోనే అధికారులు సైతం అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ జీ హుజూర్ అంటూ తలాడిస్తున్నారు. ఇసుక అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలవడంతో ప్రజలంతా అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా విస్తుపోతున్నారు. హంద్రీ నీవా కాలువ పనుల పేరుతో ఇసుకను అక్రమంగా దోచేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. ములకలచెరువు మండలంలోని రామానాయునికోట ఏటి వద్ద పెద్ద ఎత్తున హిటాచీ యంత్రాలతో ఇసుకను టిప్పర్లలో నింపి పగలే అక్రమంగా తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు వాటిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ స్పందించి కాలువ పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.