
బిట్ కాయిన్స్ పేరుతో మోసం
బి.కొత్తకోట : బిట్ కాయిన్స్తో మంచి లాభాలు వస్తాయని, దీని లావాదేవిలు నిర్వహించాలని నమ్మించిన ఓ వివాహిత తనను మోసం చేసిందని బి.కొత్తకోట పీటీఎం రోడ్డుకు చెందిన కె.రామ్మూర్తి ఆదివారం వీడియో సందేశం విడుదల చేసి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మదనపల్లెకు చెందిన యువతి వివాహం చేసుకుని తిరుపతిలో స్థిరపడింది. రామ్మూర్తి ఇంటి స్థలాల క్రయ విక్రయాలను చేస్తుంటాడు. దీనితో యువతి తల్లికి ఇంటి స్థలానికి సంబంధించి విక్రయించే విషయంలో పరిచయం కలిగింది. తర్వాత ఆ యువతి డబ్బును బిట్ కాయిన్స్లో పెట్టి లావాదేవీ లు నిర్వహిస్తే భారీ ఆదాయం వస్తుందని నమ్మించింది. దీనితో రామ్మూర్తి ఆ యువతి ఖాతాకు రూ.4.35 లక్షలు జమ చేశాడు. తర్వాత విడత వారీగా రూ.5 లక్షలు నగదు ఇచ్చాడు. ఖర్చులు, ఆస్తి తనఖా పెట్టి తెచ్చిన అప్పుపై వడ్డీ, కలుపుకుని మొత్తంగా రూ.15 లక్షలు నష్టపోయినట్టు చెబుతున్నాడు. ఈ లావాదేవీల కోసం బ్యాంకులో కరెంట్ ఖాతాను తెరవాలని చెప్పి బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ల్లో తిప్పింది. ఈ పరిస్థితులను గమనించిన రామ్మూర్తి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఇస్తానని నమ్మిస్తూ ఇవ్వడం లేదని చెబుతూ బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మోసపోయానంటూ వీడియో సందేశం విడుదల చేయగా అది వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
రూ.15 లక్షలు నష్టపోయానని ఆవేదన
పోలీసులను అశ్రయించిన బాధితుడు