
వాస్తు మార్చినా వేటు తప్పలే!
వివాదాలతో ఎంపీడీఓలు,
ఎంపీఓల బదిలీలు
హుస్నాబాద్కు వచ్చేందుకు అధికారుల వెనుకడుగు
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వివాదంలో చిక్కుకుని బదిలీ అవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ మధ్య వివాదంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారించిన అధికారులు ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డిని సస్పెండ్ చేసి ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎంపీఓ సత్యనారాయణ కూడా అధికారుల మధ్య వివాదంతోనే సస్పెండ్ అయ్యారు. హుస్నాబాద్కు పోస్టింగ్ తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని నూతనంగా నిర్మించి 2019 జూన్లో ప్రారంభించారు. కార్యాలయంలో ఎంపీడీఓ, ఎంపీపీల చాంబర్స్ విషయంలో అప్పటి ఎంపీడీఓ రాము, ఎంపీపీ మధ్య వివాదం తలెత్తడంతో ఎంపీడీఓను బదిలీ చేయించారు. తర్వాత జయశీల వచ్చిన కొద్ది రోజులు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిపోయారు. సత్యశ్రీ ఎంపీడీఓగా వచ్చిన అధికారుల మధ్య విభేదాలతో ఆమెను నంగునూరుకు బదిలీ చేయించారు. ఎంపీడీఓగా కుమారస్వామికి పోస్టింగ్ ఇస్తే ఏడాది పాటు విధులు నిర్వహించిన ఆయనపై కూడా మండల పరిషత్ సిబ్బంది ఎంపీపీకి తప్పుడు సమాచారం ఇచ్చి వివాదాలు సృష్టించి బదిలీ చేయించారు. ఆ తరువాత ఎంపీడీఓగా అనిత బాధ్యతలు స్వీకరించి పరిపాలనపై పట్టు బిగిస్తున్న సమయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయించి మరీ బదిలీ చేయించారు. కొద్ది రోజులు కోహెడ సూపరింటెండెంట్ రాఘవేంద్ర రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎంపీడీఓల బదిలీల్లో హన్మకొండ జిల్లా నుంచి వేణుగోపాల్ రెడ్డి హుస్నాబాద్కు బదిలీపై వచ్చాడు. ఎంపీపీల పాలన ముగిసిన వెంటనే అందరూ వివాదాలతో బదిలీ అవుతున్నారని ఎంపీడీఓ చాంబర్ను ఎంపీపీ గదికి మార్చుకొని పరిపాలన సాగించాడు.
అంతర్గత విభేదాలపై ఫిర్యాదులు
ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే అధికారుల మధ్య అంతర్గత విభేదాలతోనే ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ అయినట్లు తెలిసింది. వాస్తు లేదని ఎంపీడీఓ చాంబర్ను మార్చిన అధికారికి అపవాదు తప్పలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. హుస్నాబాద్ ఎంపీడీఓగా ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించి, ఎంపీఓ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ రవీందర్రావుకు అప్పగించారు. కార్యాలయం నిండా సిబ్బంది ఉన్న అధికారులు ఎవరూ సమయానికి విధులకు రాకపోవడం, విధులకు వచ్చినా వ్యక్తిగత పనులపై బయటే ఎక్కువ సమయం కేటాయిస్తారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ఐదేళ్లు.. ఆరుగురు బదిలీ