నేటి ‘చలో విజయవాడ’కు వైఎస్సార్‌టీఏ మద్దతు | - | Sakshi
Sakshi News home page

నేటి ‘చలో విజయవాడ’కు వైఎస్సార్‌టీఏ మద్దతు

Oct 7 2025 4:19 AM | Updated on Oct 7 2025 2:03 PM

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఫ్యాప్టో తలపెట్టిన మహాధర్నాకు వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (వైఎస్సార్‌టీఏ) మద్దతు తెలుపుతున్నట్లు సంఘ రాష్ట్ర నాయకుడు చందోలు రవికుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, బోధనేతర కార్యక్రమాలను వారికి అప్పగించవద్దని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, పాత పెన్షన్‌ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా నెరవేర్చలేదని తెలిపారు.

పశ్చిమ డెల్టాకు 7,713 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 7,713 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్‌ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 306 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌కు 1,888, తూర్పు కాలువకు 620, పశ్చివ కాలువకు 225, నిజాపట్నం కాలువకు 435, కొమ్మూరు కాలువకు 3,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి 50,025 క్యూసెక్కుల వదులుతున్నారు.

బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి

– పల్నాడు డీఈఓ చంద్రకళ

నరసరావుపేట ఈస్ట్‌: మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ తెలిపారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారికి అందిస్తున్న శిక్షణా తరగతులను సోమవారం డీఈఓ చంద్రకళ సందర్శించి తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని హితవు పలికారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి సత్యనారాయణ సింగ్‌, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్‌పర్సన్‌లు పాల్గొన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జుసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 588.00 అడుగులకు చేరింది. ఇది 306.1010 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 9,076, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 33,211, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 54,427 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 54,427 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాద రావు సోమవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలో నిర్వహించే లెక్కింపులో పాల్గొనదలచిన భక్తులు డ్రస్‌కోడ్‌లో హాజరు కావాలని సూచించారు. కానుకల లెక్కింపు కారణంగా ఆ రోజున జరగాల్సిన స్వామివారి నిత్య శాంతి కల్యాణం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement