
నాడు ఇంటి వద్దకే సేవలు
● వైఎస్సార్పీపీ పాలనలో పార్టీలకతీతంగా..
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో కులం, మతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేశారు. ప్రజలు సంక్షేమ పథకాలకు ఎవ్వరి దగ్గరికి వెళ్లి సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా పథకాలను పంపిణీ చేశారు. ఒక్క ఏడాది పథకాలు అమలు చేసి చేతులు దులుపుకోకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల దరఖాస్తులను పూర్తి చేసి అందజేసేవారు. జిల్లా వ్యాప్తంగా 612 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,220 మంది వలంటీర్లు ప్రతి నెలా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించేవారు.
● వైఎస్సార్సీపీ పాలనలో అదనంగా పింఛన్లు
వైఎస్సార్సీపీ పాలనలో ఏటా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించి మంజూరు చేసేవారు. 2019 సంవత్సరానికి ముందు టీడీపీ ప్రభుత్వం జిల్లాలో 4,65,180 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేసేది. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు జిల్లాలో 5,22,869 మందికి పింఛన్లను అందజేసింది. దాదాపు 57 వేల మందికి అదనంగా పింఛన్లను అందజేసింది.
● వలంటీర్లతో సేవలు
ప్రతి నెలా ఒకటో తేదీన వేకువజామునే వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టి పింఛన్లు అందజేసేవారు. దూర ప్రాంతాల్లో చికిత్సలు పొందుతున్న లబ్ధిదారులకు సైతం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పింఛన్లు ఇచ్చేవారు.
● ఇంటి వద్దే సమస్యల పరిష్కారం
గత ఐదేళ్లల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా గ్రామ సచివాలయం పరిధిలోనే పరిష్కారం అయ్యేవి. వాలంటీర్లే ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవారు. ప్రతి నెలా అధికారిక యంత్రాంగం గ్రామాల్లో పర్యటించేవారు. ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేవారు.
● అర్హులయితే సరి..పట్టా ఇవ్వండి
గత వైఎస్సార్సీపీ సర్కారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆయా గ్రామాల పరిధిలోని లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి పట్టాతో పాటు పక్కా గృహం మంజూరు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1263 లే అవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 1,48,877 మంది లబ్ధిదారులకు పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశారు. దీంతో లక్షల మంది సొంతింటి కలను నెరవేర్చుకున్నారు.
● డాక్టర్లే ఇంటి వదకు వచ్చి..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించారు. ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు చేశారు. అదే విధంగా డాక్టర్లే ఇళ్ల వద్దకు వెళ్లి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యం అందించారు. గత సర్కారు పాలనలో 31 సంచార వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి 5 లక్షలకు పైగా ప్రజలకు వైద్య సేవలందించారు.