
మామిడి రైతులను ఆదుకోకుంటే ఆత్మహత్యలే
● జిల్లాలో మామిడి ధరలు పతనం ● రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానిదే బాధ్యత ● సమావేశంలో రైతుల ఆవేదన ● జూన్ 2న కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా మామిడి రైతులను ఆదుకోకుంటే.. రైతుల ఆత్మహత్యలను చూస్తారని.. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని రైతు నాయకులు ప్రకాష్, హరిబాబునాయుడు, శేషాద్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు నగంలోని ప్రెస్క్లబ్లో గురువారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో మామిడి ధర దిగజారిందన్నారు. మార్కెట్లోకి వెళ్తే మామిడి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు. సీజన్ ప్రారంభమైనా ఫ్యాక్టరీలు తెరుచుకోవడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు. ధరలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసిగా ఉండి గతంలో చక్కెర ఫ్యాక్టరీలను మూయించారన్నారు. చెరుకు పంట పోగా.. మామిడి నాటితే.. ఈ పంటను కూడా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులంతా ఏకమై జూన్ 2వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలోని రైతులంతా పాల్గొని గిట్టుబాటు ధర కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు నాయకులు మహదేవనాయుడు, రఘునాథనాయుడు, జయచంద్రనాయుడు, చిన్నబ్బరెడ్డి, లోకమందడి తదితరులున్నారు.