
తగ్గిస్తారా.. తప్పు ఒప్పుకుంటారా?
నినాదాలు చేస్తున్న అభినయ్, వైఎస్సార్సీపీ నేతలు
వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి దూకుడుకు కూటమి ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారును నిత్యం ఇరుకున పెడుతుండడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది. మొన్నటికి మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వినూత్న రీతిలో తెలిపిన నిరసనగా సమాధానం చెప్పుకోలేక సతమతమైంది. తర్వాత సూపర్ సిక్స్ హామీలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడంతో కూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. ఈ క్రమంలోనే యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నాటకీయంగా చూపించిన పెట్రో ధరల విషయాలను గుర్తుచేస్తూ ఇరుకున పెట్టడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాజకీయాల్లో విశ్వనీయత ఉండాలంటే నేతలు మాట ఇస్తే దాని మీది నిలబడాలని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో యువగళం సందర్భంగా నారా లోకేష్ కర్ణాటక, ఆంధ్రలో పెట్రో ధరల మధ్య తేడాను చూపుతూ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రో ధరలు తగ్గిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ సదరు హామీ అమలు కాకపోవడంతో భూమన అభినయ్ మండిపడ్డారు. బుధవారం వేకువజామున కర్ణాటకలో లోకేష్ వెళ్లిన పెట్రోల్ బంక్కే వెళ్లి పెట్రోల్ పట్టించుకున్నారు. ధర ఎంత ఉందో బహిరంగంగా ప్రదర్శించారు. వెంటనే కుప్పంలో లోకేష్ వెళ్లిన బంక్లోనే పెట్రోల్ తీసుకుని ధరను చూపించారు. కర్ణాటక కంటే కుప్పంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు వెంటనే పెట్రో ధరలు తగ్గించాలని కోరారు. లేకుంటే తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యువగళం హామీ హామీ అమలు చేయాలి
పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి
లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి
నారా లోకేష్కు భూమన అభినయ్ డిమాండ్

తగ్గిస్తారా.. తప్పు ఒప్పుకుంటారా?

తగ్గిస్తారా.. తప్పు ఒప్పుకుంటారా?