
డీఐజీగా మునిశంకరయ్య
చిత్తూరు కార్పొరేషన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువ, ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ మునిశంకరయ్యకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా డీఐజీగా ఆయనకు ఉద్యోగన్నతి కల్పించారు. ఈయన స్థానంలో ఇన్చార్జ్గా తిరుపతి జిల్లా రిజి స్ట్రార్ శ్రీరామ్కుమార్ను నియమించారు.
ఆస్పత్రుల్లో బదిలీలకు కుయుక్తులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్లో ఐదేళ్లు, మూడేళ్లు దాటిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి జిల్లా అధికారులు రెండు రోజుల కిందటే రాష్ట్రస్థాయి అధికారులకు పంపారు. మంగళవారం బదిలీలకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నచోటే పాతుకుపోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఆస్పత్రుల్లో డ్యూటీలకు ఢుమ్మా కొట్టి యూనియన్ మీటింగ్, ప్రజాప్రతినిధులు, కూటమి నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. ముందుగానే సిఫార్సు లేఖలకు క్యూకడుతున్నారు. దీనికితోడు యూనియన్ల సహకారం ఉంటుందని కొత్త కమిటీకి సై అంటున్నారు. బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చాక కూడా కమిటీ ఏర్పాటు చేయడంపై కొందరు ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అత్యవసరంగా రాత్రి పూట కూడా సమావేశం నిర్వహించి కమిటీ ఏర్పాటు చేయడం సరికాదని వ్యతిరేకిస్తున్నారు. ఇలానే జరిగితే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
● వైద్యుడి దుర్మరణం
కోలారు: కర్ణాటకలోని చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ వైద్యుడు మృతి చెందారు. వివరాలు.. అనంతపురంలోని ఇందిరానగరకు చెందిన కృష్ణ జగన్(24) కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో అనంతపురం వెళ్లిన ఆయన కారులో తిరుగుప్రయాణమయ్యారు. ఉదయం 8.30 గంటల సమయంలో బంగారుపేట తాలూకా సిద్ధనహళ్లి వద్ద టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ కృష్ణ జగన్ అక్కడికక్కడే మరణించారు. బంగారుపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
బంగారుపాళెం : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు .. మండలంలోని బోడబండ్లకు చెందిన వెంకటేష్ (48) శనివారం ద్విచక్రవాహనంపై పలమనేరుకు వెళ్లి తిరిగివస్తుండగా పాలమాకులపల్లె పిళ్లారి గుండు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం చైన్నెలో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య కామాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.