
నేడు పింఛన్ల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు పింఛన్ల పంపిణీపై క్షేత్ర స్థాయి అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే ఒకటో తేదీన జిల్లాలోని 2,64,520 మంది లబ్ధిదారులకు రూ.112.80 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అలసత్వం వహించకుండా పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ నగదు అందజేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. గత నెలల్లో వివిధ కారణాలతో పింఛన్ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం నగదు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
శాంతిభద్రతల పటిష్టతకు చర్యలు
పుత్తూరు: జిల్లాలో శాంతిభద్రతల పటిష్టతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్రాజు తెలిపారు. బుధవారం పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వడమాలపేట, నారాయణవనం, పుత్తూరు స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గంజాయి, సారా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, శాంతిభద్రతలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకించి ఈగల్ టీమ్ను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు జాతీయ రహదారుల్లో నిఘా వ్యవస్థను పెంచుతున్నట్లు తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, బీట్ సిస్టమ్ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎస్హెచ్ఓల ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తూ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.రవికుమార్, సీఐ కెబీ సురేంద్రనాయుడు, ఎస్ఐ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.