
ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో బదిలీల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ఫౌండేషన్, బేసిక్, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేసిందన్నారు. ఫౌండేషన్ పాఠశాలలో ఒక రకంగా, బేసిక్ ప్రాథమిక పాఠశాలలో వేర్వేరుగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను కేటాయించడం సరికాదని మండిపడ్డారు. ఫౌండేషన్ పాఠశాలల్లో 1:20గా సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక నిధులు కేటాయించాలి
మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులతో సంబంధం లేకుండా ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు, ప్రత్యేక నిధులు కేటాయించాలని వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు, రేషనలైజేషన్ పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా సర్దుబాటు ప్రక్రియ చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో రోజుకు ఒక రకమైన కసరత్తు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కసరత్తుతో టీచర్లలో గందరగోళం నెలకొంటుందన్నారు. టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్ కోరారు. వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి మే 30వ తేదీ వరకు జరుగుతున్న బదిలీలు, ఉద్యోగోన్నతులు ,రేషనలైజేషన్కు సంబంధించి టీచర్లకు ఏ సమస్యలొచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.సుధాకర్రెడ్డి, సహధ్యక్షులు కె.రెడ్డెప్పనాయుడు, ఎస్ రెహానాబేగం, కోశాధికారి కె. ప్రసన్న కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ పి బాషా, పీఆర్ మునిరత్నం, జిల్లా కార్యదర్శులు సీపీ ప్రకాష్, డి. ఏకాంబరం, బి. ఈశ్వర్ మహేంద్ర, కె. సరిత తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి