
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారెపల్లి రవీందర్ రెడ్డి (56) శాంతిఖని సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం..భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేస్తూ కుర్చీలో కుప్పకూలిపోయాడు. బుధవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో విషయాన్ని భర్తకు చెప్పడానికి భార్య మంజు పలుమార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సహచర కార్మికుడికి ఫోన్ చేసి ఓసారి ఇంటికి వెళ్లి చూడాలంది. అతను వెళ్లి ఇంటి కిటికీ నుంచి చూడగా కుర్చీలో రవీందర్ రెడ్డి బిగుసుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. చుట్టుపక్క ఇళ్ల వారిని పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులకు ఆయన సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
వడగళ్ల వానకు అతలాకుతలం
● తడిసిన ధాన్యం, విరిగిన స్తంభాలు
● నేలరాలిన మామిడి
నెన్నెల/భీమారం/మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: నెన్నెల మండలం గుండ్లసోమారం, చిత్తాపూర్, ఆవుడం, జెండావెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి, కొత్తూర్, గంగారాం గ్రామాల్లో బుధవారం సాయంత్రం వడగళ్లతో కూడిన గాలివాన కురిసింది. ధాన్యం కుప్పలు తడిసిపోగా కోతకు వచ్చిన వడ్లు, మామిడికాయలు నేలరాలిపోయాయి. గుండ్లసోమారంలో రెండు విద్యుత్ స్తంభాలు, నాలుగు రేకుల షెడ్లు కూలిపోయాయి. నెన్నెల హన్మాన్ మందిర్ వద్ద విద్యుత్వైర్ తెగిపోవడంతో మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీమారం మండలంలో వడగళ్ల వానకు మామిడితోటలకు నష్టం వాటిల్లింది. దాంపూర్ గ్రామంలో ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మంచిర్యాలలో తేలికపాటి వర్షం కురిసింది. జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన ఐటిపాముల మల్లేశ్ ఇంటి రేకులు గాలికి ఎగిరిపోయి ఇల్లు కూలింది. శివ్వారంలో పెద్దపల్లి నర్సయ్య ఇల్లు ధ్వంసమైంది. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కాత దశకు చేరిన మామిడి కాయలు నేలరాలిపోయాయి.

గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి