
పోరాట పటిమ కార్యకర్తల సొంతం
● వారి కోసమే పార్టీ బాధ్యతలు తీసుకున్నా
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి
● వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ
మలికిపురం: ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటానికై నా జెండా పట్టుకుని ముందుండేది ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మాత్రమేనని, అటువంటి పోరాట పటిమ తమ కార్యకర్తలకే సొంతమని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ మలికిపురంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ అనే విత్తనం వేస్తే, దానిని మానుగా మార్చింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొనైనా పార్టీని సగర్వంగా నిలిపిన కార్యకర్తలను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తమ పార్టీ స్థాపించిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నాయని గుర్తు చేశారు. కార్యకర్తల కోసమే తాను పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించానన్నారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకూ శత్రువులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత తమదని, దానికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వొద్దని నేరుగా కూటమి పెద్దలే చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో పనిచేసి ఓడిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది తమ అధినేత మాత్రమేనని జగ్గిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జెడ్పీటీసీ సభ్యులు బల్ల ప్రసన్నకుమారి, కుసుమ వనజకుమారి, ఎంపీపీ వీరా మల్లిబాబు, పార్టీ మండల అధ్యక్షులు బొలిశెట్టి భగవాన్, కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీరావు, కుసు చంద్రశేఖర్, కేఎస్ఎన్ రాజు, కంచర్ల శేఖర్, జంపన బుజ్జీరాజు, జాన శంకరరావు, రుద్రరాజు చిన్నరాజా, ఈద రవిరెడ్డి, దొంగ నాగసత్యనారాయణ, ముప్పర్తి త్రిమూర్తులు, కూనపరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.