ఏపీలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి ఘటన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఇసుక మాఫియాపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై ఆ జిల్లా కలెక్టర్ను నిలదీసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ను సోమవారం విచారించిన హైకోర్టు.. సహజ వనరులను భవిష్యత్ తరాలకు మిగల్చాలని సూచించింది.
'ఏ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చారు? ఇబ్బడిముబ్బడిగా తవ్వకాలు చేపడితే ఎలా? భవిష్యత్ తరాలకు ఇసుక అవసరం ఉండదా?' అని ప్రశ్నించింది. ఇష్టానుసారంగా క్వారీలకు అనుమతులు మంజూరు చేయడం తగదని, మాఫియా బారినుంచి ఇసుక సహా ఇతర సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని గుర్తుచేస్తూ విచారణను వచ్చే సోమవారానికి వాయిదావేసింది.