
● రూ.కోట్లలో పెండింగ్.. నో గ్యారంటీ ● కొత్తగా ఐదు మిల్
మంచిర్యాలఅగ్రికల్చర్: రూ.కోట్లు బకాయి ఉన్న రైస్మిల్లులకే మళ్లీ ధాన్యం కేటాయింపు జరుగుతోంది. బకాయితోపాటు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుండానే ధాన్యం తరలిపోతోంది. ఇప్పటికే ముప్పుతిప్పులు పెడుతున్న మిల్లర్లు సీఎంఆర్ ఏ మేరకు ఇస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గత నెల 29వరకు 11 రైస్మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. 30న మరోసారి ఐదు మిల్లులకు ట్యాగింగ్ వచ్చింది. ఈ ఐదింటిలో నాలుగు గతంలో ధాన్యం దించుకుని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని, యాక్షన్ ధాన్యానికి సంబంధించి పెండింగ్ బకాయి చెల్లించనివి ఉన్నాయి. అయినా మళ్లీ ధాన్యం కేటాయించ డం గమనార్హం. జిల్లాలో 2022–23 యాసంగి నుంచి 2023–24 వానాకాలం సీజన్ల సీఎంఆర్ ధాన్యం తీసుకుని రూ.కోట్లు విలువైన బియ్యం ఇవ్వకుండా, యాక్షన్ ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. వీరికి సీఎంఆర్ ధాన్యం కేటాయించొద్దని, బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసులూ జారీ చేశారు. జిల్లాలో ఒకరిద్దరిపై ఆర్ఆర్ యాక్టు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ ఇటీవల పలువురు మిల్లర్లు దొడ్డిదారిన సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు చేసుకుంటున్నారు. జన్నారం, హాజీపూర్, మందమర్రి ప్రాంతాల్లో బ్లాక్లిస్టులో ఉన్న పూర్తి స్థాయిలో బకాయి చెల్లించని మిల్లర్లకు ధాన్యం కేటాయించారు. జిల్లాలో ఇంకా బాయిల్డ్ రైస్మిల్లులు ఉన్నా బకాయిలు చెల్లించకపోవడంతో ధాన్యం కేటాయించలేదు. కొన్నింటికి మాత్రమే నాలుగు రోజుల క్రితం అనుమతి లభించింది.
ఇంకా రూ.85కోట్లు పెండింగ్
2022–23 సీజన్లో గోదాముల్లో నిల్వ చేసిన ధా న్యానికి తాము ఎందుకు నగదు చెల్లించాలని, మి ల్లు పేరిట కేటాయించి ధాన్యం తీసుకోకపోయినా నగదు చెల్లించాలనడం ఏమిటని కొందరు మిల్లర్లు ఉన్నతాధికారుల వద్ద వేడుకోవడంతో కొంత వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బా యిల్డ్ రైస్మిల్లులు 19, రా రైస్మిల్లులు 35 ఉన్నా యి. రెండు సీజన్ల సీఎంఆర్ ఇవ్వకపోవడం, తనిఖీ ల్లో ధాన్యం నిల్వలు లేకపోవడాన్ని గుర్తించారు. సీఎంఆర్, యాక్షన్ ధాన్యానికి సంబంధించి రూ.138.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ధాన్యం దక్కించుకునేందుకు ట్యాగింగ్ కోసం అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఓ మిల్లర్ రూ.11కోట్ల మేర బకాయి ఉన్నా పలుకుబడి, కొంత నగదు చెల్లించి ట్యాగింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కొందరు గత నెల 21న బకాయిలో 10 నుంచి 30శాతం చెల్లించి మిగతా బకాయిలు వారం పది రోజుల్లో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రూ.85కోట్లు బకాయి రావాల్సి ఉంది. ఇందులో ఒక మిల్లు బకాయి మొత్తం చెల్లించగా.. నాలుగు మిల్లులు రూ.కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం బకాయిలు లేని మిల్లులు పది శాతం గ్యారంటీ, పాత బకాయి మరో 20శాతం అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం కేటాయింపులు నడుస్తున్నాయి.
జిల్లాలో ఓ మిల్లు ఎదుట బారులుతీరిన ధాన్యం లారీలు
ధాన్యం దక్కించుకునేందుకు..
సీఎంఆర్ ధాన్యం కేటాయింపులకు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి ధాన్యం దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర కమిషనరేట్, కలెక్టరేట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఓ మిల్లర్ తనకున్న పలుబడితో ఎలా కేటాయించరో చూస్తానని సవాల్ చేసి మరీ దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద మిల్లర్లు కొందరు మూలకు పడిన, వివిధ కారణాలతో ఆగిన మిల్లులను అద్దెకు తీసుకుని ధాన్యం కేటాయింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ కొందరు అక్రమార్కులు ఇదే పద్ధతిలో కేటాయింపులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. కొందరు అధికారుల సహకారం వల్లే కేటాయింపులు జరిగినట్లు గతంలో మిల్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
హాజీపూర్, బెల్లంపల్లి మండలాల్లో రెండు రైస్మిల్లులు అద్దెకు తీసుకుని ఓ మిల్లు యజమాని గతంలో సీఎంఆర్ ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా రూ.కోట్లలో ప్రభుత్వానికి మొండి చేయి చూపడంతో క్రిమినల్ కేసు నమోదై జైలుకు వెళ్లారు.
గడువు తీసుకున్న తర్వాతే..
పాత బకాయి ఉన్న మిల్లులు కొంత మేర చెల్లించిన వారితోపాటు మిల్లర్ల ప్రాపర్టీ, ఇతర ష్యూరిటీలు, పాత బకాయి చెల్లింపునకు గడువు తీసుకున్న తర్వాత ధాన్యం కేటాయిస్తున్నాం. ధాన్యం కేటాయింపు
కలెక్టర్ నిర్ణయం మేరకే జరుగుతుంది.
– శ్రీకళ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్