breaking news
rationalization process
-
రేషనలైజేషన్ ప్రక్రియ బహిష్కరణ
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులపై స్పష్టత ఇచ్చేంత వరకు రేషనలైజేషన్ జరగనివ్వమంటూ అడ్డగించారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన రేషనలైజేషన్ ప్రక్రియకు ముందుస్తు సమాచారం ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలతో పాటు మిగిలిన మూడు మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముందుగా పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించిన సమయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల వాస్తవ నమోదు ప్రకారం మిగులు పోస్టులు గుర్తించాలని, రేషనలైజేషన్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తారని, మిగులు ఉపాధ్యాయులను ఎక్కడికి కేటాయింపు చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులను సర్దుబాటు చేసిన తరువాతే మిగులు పోస్టులు చూపించాలని, సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయుల జాబితాను తయారుచేసి ఆ జాబితాను పాఠశాలలకు ఇచ్చిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొద్ది సేపు వారించారు. మిగులు ఉపాధ్యాయులపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పగా... ఆ స్పష్టతపై ముందుగా తేల్చాలని డిమాండ్ చేశారు. అంత వరకు రేషనలైజేషన్ ప్రక్రియను జరగనివ్వమంటూ, కౌన్సెలింగ్కు హాజరైన ఉపాధ్యాయులంతా కార్యాలయం బయటకు వచ్చేశారు. -
సర్దుబాటు మోళీ.. అవన్నీ ఖాళీ
టీచరు పోస్టుల భర్తీలో ఇదీ సంగతి 10,603 పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా 9,061కు మాత్రమే ప్రకటన సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న పోస్టుల సంఖ్యకు, జిల్లాల్లో వాస్తవ ఖాళీలకు పొంతన కుదరడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను వేరే పాఠశాలల్లో తరలించింది. అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులలో వీరిని నియమించింది. ఇలా దాదాపు 15వేల మందిని ఇతర పాఠశాల ల్లోకి పంపి అక్కడి పోస్టులను ఖాళీగా లేనట్లుగా చేసింది. అంటే అప్పటివరకు 15వేల పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం వేరే పాఠశాలల టీచర్లను సర్దుబాటుపేరిట అక్కడ నియమించి ఖాళీలు లేనట్లుగా చేసింది. ఇలా అనేక మండలాల్లో ఖాళీ పోస్టులేవీ లేనట్లుగా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది. సర్దుబాటుపేరిట ఖాళీ పోస్టులను నింపేసిన స్థానాల సంగతి అటుంచితే జిల్లాల్లో తాజాగా ఉన్న ఖాళీలను కూడా పూర్తిస్థాయిలో చూపించడం లేదు. గురువారం షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు స్కూల్ అసిస్టెంటు, భాషాపండితులు, పీఈటీ, ఎస్జీటీ పోస్టులలో 9061 ఖాళీలున్నట్లు ప్రకటించారు. జిల్లాల నుంచి ‘సాక్షి’ సేకరించిన సమాచారం ప్రకారం ఖాళీల సంఖ్య అంతకన్నా ఎక్కువగానే ఉంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని పోస్టులు 10,603గా ఉంది. మంత్రి ప్రకటించిన ఖాళీల సంఖ్య 9,061 మాత్రమే. దాదాపు 1,500 పోస్టులను తగ్గించి చూపించారు. ఆర్థిక శాఖ అనుమతివ్వలేదన్న సాకుతో పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడింది. భాషా పండితుల ఖాళీలు 975 ఉండగా దాన్ని 812కు, పీఈటీలు 185 ఉండగా 156కు, ఎస్జీటీ పోస్టులు 7594 ఉండగా 6244 పోస్టులను మాత్రమే అధికారికంగా చూపుతోంది. ఇవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో మరో 225 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ విషయం ఎప్పుడన్నది తేల్చలేదు.