disgrace
-
100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్హౌస్కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్లాండ్ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది. -
మందుబాబులకు అడ్డాలుగా... 'కియోస్క్’లు!!
సాక్షి, హైదరాబాద్: ఆకలిగొన్నవారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్ఫుడ్ను రెడీమేడ్గా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కియోస్క్లు (డబ్బాలు) ప్రారంభానికి ముందే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మల్లేపల్లి నైస్ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో చిరువ్యాపారులకు అవకాశం కల్పించేందుకు అక్కడ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్లో వివిధ రకాల స్ట్రీట్ఫుడ్తోపాటు కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్ తదితరమైనవి విక్రయించాలని భావించారు. దాదాపు రూ.85 లక్షల వ్యయంతో ఈ స్ట్రీట్ వెండింగ్జోన్ ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు అక్కడ అవసరమైన కియోస్క్లు ఏర్పాటు చేశారు. వాటిని ఉంచేందుకు లక్షల వ్యయంతో నిర్మించిన ఫుట్పాత్ను, మొక్కలను సైతం ధ్వంసం చేశారు. ఇంతా చేసి...వెండింగ్ జోన్ను ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారు. కియోస్క్లనైనా అందుబాటులోకి తెచ్చి లక్ష్యాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. కియోస్క్లను ఎవరికీ పట్టనట్లు వదిలివేయడంతో ఆ మార్గం పోకిరీలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సీసాలు వంటివి దర్శనమిస్తున్నాయి. రాత్రివేళల్లో కియోస్క్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరైటీలెన్నో.. వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉండాలనే తలంపుతో 12 కియోస్క్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో దక్షిణభారత వంటకాలతోపాటు చైనీస్ వంటకాలు, షవర్మా, చాట్, పిజ్జా బర్గర్లు, కబాబ్స్, ఐస్క్రీమ్స్, స్వీట్స్, జ్యూస్, కాఫీ,కూల్డ్రింక్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తద్వారా చెత్తాచెదారాలతో ఉండే వీధి బాగుపడటంతోపాటు స్ట్రీట్వెండింగ్ జోన్ వల్ల చిరువ్యాపారులకు ఉపాధి, ప్రజలకు వెరైటీ ఆహారపదార్థాలు వినియోగంలోకి వస్తాయనుకున్నారు. కానీ..డబ్బాలను ఏర్పాటు చేశాక కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజల సదుపాయం కోసం నిర్మించిన కాంక్రీటు బెంచీలు, టేబుళ్లపై, ఫుట్పాత్పై మట్టి, రాళ్లకుప్పలతో పరిస్థితులు పరమ దరిద్రంగా ఉన్నాయి. సంబంధిత అధికారి వివరణ కోసం ప్రయత్నించగా కార్యాలయంలో లేరు. ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాలయ ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా జోన్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పారిశుధ్య కార్యక్రమాల అమలు చర్యల పర్యవేక్షణకు వెళ్లే వైద్యాధికారులకు సైతం ఇవి కనిపించడం లేవు. జోన్లకే అధికారాలు వికేంద్రీకరించడంతో ఏ జోన్లో ఏం పని జరుగుతోందో ప్రధాన కార్యాలయానికి తెలియడం లేదు. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) (చదవండి: సింఘు నుంచి సొంతూళ్లకు..) -
శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు పరిశ్రమకు అవమానం
ఇటీవల చెన్నైలో ముగిసిన భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర అవమానం జరిగిందని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మండిపడ్డారు. అసలు సీనియర్లెవరినీ ఈ ఉత్సవానికి పిలవలేదని, వెళ్లినవారికి కూడా తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు. దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి కార్యక్రమం మధ్యలోనే బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలు మంగళవారంతో ముగిశాయి. సోమవారం నాడు భారతీయ సినీ ప్రముఖుల్లోని 41 మందిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. చెన్నైకి చెందిన పరిశ్రమ సీనియర్లలో చాలామందిని కనీసం ఆహ్వానించలేదని, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర లాంటివారిని కూడా పిలవలేదని మురారి చెప్పారు. తనను పిలుస్తారని చెప్పినా, ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో వెళ్లకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ఎవరినైనా సత్కరించాలనుకుంటే వారికి ముందుగా చెప్పాలని, చిట్టచివరి నిమిషంలో వచ్చి అవార్డు తీసుకోమని చెబితే కుదరదని అన్నారు. అసలు వాళ్లకు కనీస ప్లానింగ్ కూడా లేదని మండిపడ్డారు. నాలుగు రోజులకు కలిపి ఒక పాస్ ఇచ్చి ఉండాల్సిందని, అలా కాకుండా ప్రతిరోజూ పాస్ కోసం గుమ్మం దగ్గర కళాకారులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చిందని అన్నారు. కమిటీ వద్ద శాలువాలు, మెమొంటోలు అయిపోవడంతో తీసుకున్నవాళ్లు మళ్లీ వాటిని తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని తెలిసినట్లు కూడా మురారి చెప్పారు. సీనియర్ నటి కవిత, నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి లాంటి వాళ్లు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు. తాను 150కి పైగా చిత్రాల్లో నటించానని, అగ్రహీరోలు అందరి సరసన హీరోయిన్గా చేశానని, అలాంటి తనను కనీసం పిలవను కూడా పిలవలేదని కవిత అయితే కంటనీరు పెట్టారు. వందేళ్ల సినిమా సంబరాలంటే కళామతల్లికి ధన్యవాదాలు చెబుతారనుకున్నానని, తీరా వేదికమీద డాన్సులు, డ్రామాలు వేశారని, సినీ రంగాన్ని గౌరవించేది ఇలాగేనా అని నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడ కనీసం నిలబడాలని కూడా అనిపించలేదని, దాంతో తాను సగంలోనే తిరిగి వచ్చేశానని ఆయన చెప్పారు. మహేష్ బాబు, ప్రభాస్, మోహన్ బాబు, దాసరి నారాయణరావు.. ఇలా చాలామంది ప్రముఖులు అసలీ ఉత్సవాలకు హాజరు కాలేదు. అయితే, ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు తప్పవని నిర్మాత, దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిల్లర కళ్యాణ్ అన్నారు.