హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్’! | Microsoft Corporation Cloud Data Center starts in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్’!

Oct 2 2014 11:53 PM | Updated on Sep 2 2017 2:17 PM

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్’!

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్’!

సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ క్లౌడ్ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనుంది.

సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ క్లౌడ్ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. 2015కల్లా దేశంలో 3 నగరాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భారత పర్యటనలో భాగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ నగరాల్లో ఇవి రానున్నదీ ఆయన వెల్లడించనప్పటికీ.. హైదరాబాద్‌తోపాటు బెంగుళూరు, ముంబైల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు  మైక్రోసాఫ్ట్ అధికార వర్గాలు తెలిపాయి.

అయితే ముంబైలో స్థల సేకరణ వీలుకాకపోతే నగరం వెలుపల ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉంది.  ఒక్కో కేంద్రానికి సామర్థ్యాన్నిబట్టి రూ.5,000 కోట్ల దాకా వ్యయం అవుతుందని వెల్లడించాయి. స్టార్టప్ కంపెనీలకు భారత్ వేదిక అవుతుండడం.. అటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు తక్కువ వ్యయానికే టెక్నాలజీని ఆసరాగా చేసుకోవాలని చూస్తుండడంతో క్లౌడ్ సేవలకు ఇక్కడ  భారీ డిమాండ్ ఉంది. 90కిపైగా దేశాల్లో క్లౌడ్ సేవలను అందిస్తున్న మైక్రోసాఫ్ట్‌కు భారత మార్కెట్ పెద్ద ఎత్తున కలిసి వస్తుంది.

 ఇప్పుడు భారత్ వంతు..
 ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 100కుపైగా క్లౌడ్ డేటా సెంటర్లున్నాయి. బింగ్, ఎంఎస్‌ఎన్, ఆఫీస్ 365, ఎక్స్‌బాక్స్ లైవ్, స్కైప్, వన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి 200లకుపైగా సేవలు అందిస్తోంది. 100 కోట్ల కస్టమర్లు, 2 కోట్ల వ్యాపార సంస్థలు క్లౌడ్ సేవలు పొందుతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ డేటా సెంటర్ ఇప్పటి వరకూ లేదు.

టెలికం, మొబైల్ రంగంలో అంచనాలను మించి రికార్డులు నమోదు చేస్తున్న భారత్‌లో క్లౌడ్ సేవల మార్కెట్‌లో రూ.120 లక్షల కోట్ల విలువైన అవకాశాలు ఉన్నాయని స్వయంగా సత్య నాదెళ్ల ప్రకటించారు. ఊరిస్తున్న ఇంత భారీ వ్యాపార అవకాశాలను దక్కించుకోవడానికి భారత్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్టు చెప్పారు. 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేసి వాణిజ్యపర క్లౌడ్ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. గతేడాది భారత్‌లో ఈ కంపెనీకి క్లౌడ్ విభాగంలో 100 శాతం వృద్ధి నమోదైంది.

 బెంగళూరు, ముంబైలో కూడా..
 హైదరాబాద్‌తోపాటు కంపెనీ పరిశీలనలో బెంగళూరు, ముంబై కూడా ఉన్నాయి. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో నిర్వహణ వ్యయం ఎక్కువని, స్థల లభ్యత కష్టమని ఆందోళన కంపెనీలో ఉంది. అయితే ముంబైకి సమీపంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది కొద్ది రోజుల్లో స్పష్టం కానుంది.  క్లయింట్లకు చెందిన సమాచారమంతా ఈ కేంద్రాల్లో నిక్షిప్తం చేస్తారు. సేవలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే ఉంటాయి.

సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవాలంటే ఏ కంపెనీకైనా వ్యయంతో కూడిన వ్యవహారం. అలాగే నిర్వహణ ఖర్చులూ అదనం. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు క్లౌడ్‌ను వినియోగిస్తున్నాయి. క్లౌడ్ అప్లికేషన్లను ప్రపంచంలో ఏ మూలనున్నా వాడొచ్చు. వివిధ అప్లికేషన్ల కోసం లెసైన్సు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంత మంది యూజర్లయినా ఒకే సర్వర్ తో అనుసంధానం అవొచ్చు.

 తొలి ప్రాధాన్యత హైదరాబాద్..
 మైక్రోసాఫ్ట్ ఆఫీస్, విండోస్, విజువల్ స్టూడియో, డెవలపర్ టూల్స్ ఫర్ విండోస్ ఫోన్, బింగ్ అభివృద్ధిలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకం. అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదే. ఇక్కడి ఉద్యోగుల్లో ప్రతిభ, వనరులు, పట్టుదల సమృద్ధిగా ఉన్నాయని నాదెళ్ల కితాబిచ్చారు కూడా.

 హైదరాబాద్‌లో అత్యుత్తమ మానవ వనరులు లభిస్తాయన్నది కంపెనీ భావన. అందుకే ఇక్కడ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతిపాదించినట్లు మైక్రోసాఫ్ట్ ఉన్నతోద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.  వాతావరణం, మానవ వనరులు, మౌలిక వసతులు, భద్రత పరంగా చూస్తే డేటా సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement