ఉపాధ్యాయులు ఎస్మా పరిధిలోకి వస్తారా? విద్యాశాఖలో సర్వీసు రూల్స్, విద్యా హక్కు చట్టం తదితర నిబంధనలు అన్నీ పరిశీలించండి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు ఎస్మా పరిధిలోకి వస్తారా? విద్యాశాఖలో సర్వీసు రూల్స్, విద్యా హక్కు చట్టం తదితర నిబంధనలు అన్నీ పరిశీలించండి.. ఎస్మా పరిధిలోకి వస్తే కనుక దానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి పంపించండి.. అని పాఠశాల విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఇప్పటికే సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులను కూడా ఎస్మా పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలు చేస్తోంది. సీమాంధ్రలో ఉపాధ్యాయులు ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ చర్యలపై దృష్టి సారించింది.
ఉద్యమాల్లో పిల్లలేంటి..?
సమైక్యాంధ్ర ఉద్యమంలోకి విద్యార్థులను తీసుకెళ్లడంపట్ల పాఠశాల విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు లక్ష గళం పేరుతో నిరసన ప్రదర్శనలు, వివిధ జిల్లాల్లో విద్యార్థులతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంపై మండిపడింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలను ఆందోళనలకు అనుమతించవద్దని విద్యాశాఖ డెరైక్టరేట్ డీఈవోలను ఆదేశించింది.
టీచర్లు విధులకు హాజరైనా.. కాకపోయినా పిల్లలు మాత్రం స్కూళ్లలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆందోళనలవైపు వెళ్లకుండా అధికారులే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. అలాగే ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల విషయంలో యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.


