కృష్ణాజిల్లా విజయవాడ లో విషాదం చోటు చేసుకుంది.
విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడ లో విషాదం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకుని, నెలనెలా వచ్చే వడ్డీనే ఆసరాగా జీవిస్తున్న దంపతులు... సంస్థ మూతపడేసరికి మనస్తాపంతో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు... విజయవాడలోని ఆర్టీసీ వర్క్షాపు రోడ్డులో నివసించే వేదాల వెంకటనారాయణ శర్మ (55), ఆయన భార్య సుందరి (50) సోమవారం అర్ధరాత్రి తర్వాత భవానీపురం ప్రాంతంలో భవానీ ఘాట్ వద్ద కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
మంగళవారం తెల్లవారుజామున వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీరిని చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. వెంకటరమణ, సుందరి దంపతులు హనుమాన్పేటలో ఉన్న ఇల్లును అమ్మగా వచ్చిన రూ. 6 లక్షలను అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేశారు.
దీనిపై వచ్చే వడ్డీతో కేన్సర్తో బాధపడుతున్న కుమారుడ్ని చూసుకుంటూ ఆర్టీసీ వర్క్షాపు రోడ్డులో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. అగ్రిగోల్డ్ కష్టాల్లో కూరుకుపోయి వడ్డీ ఆగిపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.


