
అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు!
ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో తనేమిటో నిరూపించుకున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా..
గాలే:ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో తనేమిటో నిరూపించుకున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అరంగేట్రపు టెస్టులో సైతం ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్ ద్వారా టెస్టు ఫార్మాట్లో రంగప్రవేశం చేసిన పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా 48 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా నిలకడగా ఆడాడు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. అతనికి జతగా చివర్లో మొహ్మద్ షమీ(30; 30 బంతుల్లో 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు.
అంతకుముందు 399/3 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్.. లంచ్ సమయానికే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే చటేశ్వర పుజరా(153;265 బంతుల్లో 13 ఫోర్లు) నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై మరో ఓవర్ నైట్ ఆటగాడు రహానే(57;130 బంతుల్లో 3 ఫోర్లు) అవుట్ కావడంతో భారత్ 435 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. అటు తరువాత అశ్విన్(47; 60 బంతుల్లో 7 ఫోర్లు) మెరిశాడు.
ఇక చివర్లో పాండ్యా, షమీలు రాణించడంతో పాటు ఉమేశ్ యాదవ్(11 నాటౌట్;10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆఖరి వికెట్ గా పాండ్యా పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 600 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ ఆరు వికెట్లు సాధించగా, లుహిరు కుమార మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ రంగనా హెరాత్ కు వికెట్ లభించింది.