
కాన్స్లో మన హంగామా!
మనం తీసిన సినిమా మన గడ్డపై బాగా ఆడితే ఆనందపడిపోవడం సహజం. పొరుగు రాష్ట్రంలో ఆడితే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది.
మనం తీసిన సినిమా మన గడ్డపై బాగా ఆడితే ఆనందపడిపోవడం సహజం. పొరుగు రాష్ట్రంలో ఆడితే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఏకంగా పొరుగు దేశం వారి కితాబులు అందుకుంటే ఆ మజానే వేరు. పరాయి దేశంలో మన దేశీ తారలకూ, మన చిత్రాలకూ గుర్తింపు లభిస్తే ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏటా ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ‘కాన్స్ చలన చిత్స్రోతవం’లో భారతీయ సినిమా తారల సందడి ఎక్కువగా ఉంటే... అంతదాకా మన సినిమా ఎదిగినందుకు కాలరెగరేసుకోవాలనిపిస్తుంది. ఈ నెల 22 వరకు మొత్తం 11 రోజుల పాటు జరిగే 69వ కాన్స్ చలన చిత్రోత్సవం బుధవారం ఆరంభమైంది. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనే మన దేశీ తారలు, ప్రద ర్శనకు అర్హత పొందిన మన చిత్రాలపై ఓ లుక్...
♦ తాజా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మన దేశం నుంచి రెండు ఎంట్రీలు మాత్రం ఫెస్టివల్లో ప్రధాన భాగమైన ‘ది అఫిషియల్ సెలక్షన్’కు ఎంపికయ్యాయి. ఆ రెండిట్లో ఒకటి డాక్యుమెంటరీ కాగా, మరొకటి షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్.
♦ కోల్కతాలోని ‘సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్’ విద్యార్థి అయిన సౌరవ్ రాయ్ తీసిన ‘గుండ్’ (పక్షి గూడు అని అర్థం) చిత్రం ‘కాన్స్’లో సందడి చేయనుంది. ఆయన తన డిప్లమా కోసం నేపాలీ భాషలో తీసిన 28 నిమిషాల చిత్రమిది. అఫిషియల్ సెలక్షన్లోనే ‘సినీఫాండేషన్’ అనే పోటీ విభాగంలో ఇది ప్రదర్శితమవుతోంది. ప్రపంచం నలుమూలల్లోని వివిధ సినీ శిక్షణ సంస్థల నుంచి దాదాపు 2300 ఎంట్రీలు రాగా, అందులో నుంచి ఎంపిక చేసిన 18 చిత్రాల్లో ఇది ఒకటి. డార్జిలింగ్లోని రాజకీయ సంక్షోభాన్ని క్షణకాలం పాటు నేపథ్యంగా చూపే ఈ చిత్రం ద్వారా తాను పెరిగి పెద్దవుతున్న క్రమంలోని జ్ఞాపకాలను తెరపై చూపడానికి 29 ఏళ్ళ సౌరవ్ రాయ్ ప్రయత్నించారు. ఈ చిత్రంలో నూటికి 80 పాళ్ళు వాస్తవమైతే, మిగతా 20 పాళ్ళు కల్పన అని ఈ యువ సినీ రూపకర్త చెప్పారు. మూడు బహుమతు లుండే ఈ ‘సినీఫాండేషన్’ విభాగంలో ఏవి విజేతలుగా నిలిచాయన్నది జ్యూరీ మే 20న ప్రకటిస్తుంది.
♦ మన దేశం నుంచి ఎంపికైన రెండో చిత్రం - ‘ది సినిమా ట్రావెలర్స్’. మహారాష్ట్రలోని సంచార డేరా థియేటర్లపై రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. షిర్లే అబ్రహమ్, అమిత్ మాధేషియాలు రూపొందించారు. దాదాపు 8 ఏళ్ళు శ్రమించి, ఈ 96 నిమిషాల చిత్రాన్ని రూపొందించారు. సమాంతర విభాగాల్లో ఒకటైన ‘కాన్స్ క్లాసిక్స్’ సెక్షన్లో ఈ చిత్రం ప్రదర్శిత మవుతోంది. సినిమా చరిత్రకు సంబంధించిన 9 డాక్యుమెంటరీల్ని ఈ విభాగంలో ప్రదర్శిస్తున్నారు. అందులో మన ‘ది సినిమా ట్రావెలర్స్’ ఒకటి. ఒకప్పుడు అమిత ఆదరణ పొందిన డేరా సినిమాలు ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలాంటి మార్పులకు లోనయ్యాయి, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటు న్నాయనే విషయాన్ని ఈ చిత్రంతో చరిత్రకెక్కించారు.
♦ హైదరాబాదీ జెన్నీఫర్ అల్ఫోన్సె దర్శకత్వంలో రూపొం దిన ‘ది టేక్ ఓవర్’ అనే డాక్యుమెంటరీ ‘షార్ట్ ఫిలిమ్ కార్నర్’ విభాగంలో ప్రదర్శితమవుతోంది. ‘డిజీక్వెస్ట్’ బసిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిజిటల్ మీడియాతో ఫిల్మ్మేకింగ్లో వచ్చిన మార్పుల గురించి తెలుగు, తమిళ, హిందీ చిత్రప్రముఖుల అభిప్రాయాలు దీనిలో ఉన్నాయి. కాగా, 2014లో జెన్నీఫర్ తీసిన ‘స్ట్రేంజర్స్’ కూడా గతంలో షార్ట్ ఫిలిమ్ కార్నర్లోనే ప్రదర్శితమైంది.
♦ ఇక కాన్స్లోని ప్రధాన చిత్రోత్సవంలోనే సమాంతరంగా జరిగే ఇతర సెక్షన్స్లో ఒకటి - ‘డెరైక్టర్స్ ఫోర్ట్నైట్’ విభాగం. ఇందులో మన హిందీ చిత్రం ‘రమన్ రాఘవ్ 2.0’ను ప్రీమియర్ ప్రదర్శన చేస్తున్నారు. 1960లలో ముంబయ్లో జరిగిన వరుస హత్యలకు సూత్రధారి అయిన రమన్ రాఘవ్ జీవితం ఆధారంగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టైటిల్ రోల్ చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ కాన్స్లో పాల్గొననున్నారు.
♦ ‘కాన్స్’లో చలనచిత్ర వ్యాపారం గురించి ‘మార్షె డ్యూ ఫిల్మ్’, ప్రపంచ ప్రసిద్ధ సినీరూపకర్తలు బోధించే ‘మాస్టర్ క్లాసెస్’, అంతర్జాతీయ కో-ప్రొడక్షన్స్కు అవకాశం కల్పించే ‘ప్రొడ్యూసర్స్ నెట్వర్క్’ లాంటి అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ‘ఈవెంట్స్’లో ఒకదానిలో ఈసారి మన ‘బాహుబలి’ చిత్ర టీమ్ మెరవనుంది. దర్శకుడు రాజమౌళి, ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ అలా ఈసారి కాన్స్ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ 16న ‘బాహుబలి’ని అక్కడ ప్రపంచంలోని సినీ వ్యాపారానికి వేదికగా నిలిచే ‘మార్షె డ్యూ ఫిల్మ్’లో ప్రదర్శిస్తున్నారు. అంతకు ముందు జరిగే చర్చావేదికలో వర్చ్యువల్ రియాల్టీ సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చలో పాల్గొంటారు.
♦ అధికారిక పోటీ విభాగంలో కాకపోయినా, హిందీ నటుడు కబీర్ బేడీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘మౌంట్ ఆఫ్ ఎక్స్లెన్స్’ అనే లఘు చిత్రం కాన్స్లో ప్రదర్శితం కానుంది. దీనికోసం కబీర్ బేడీ, చిత్ర దర్శకుడు శివాజీ చంద్రభూషణ్ ఫ్రాన్స్ వెళ్లనున్నారు.
తళుకులీనే తారలు...
♦ కాన్స్ నగరంలో ‘ఫ్రెంచ్ రివియెరా’ తీరంలో జరిగే ఈ అంతర్జాతీయ సినిమా ఉత్సవానికి ఎంత పేరుందంటే, స్వతంత్ర సినిమా రూపకర్తల్లో ప్రపంచ ప్రసిద్ధులందరూ దీనికి హాజరవుతుంటారు. అలాగే, హాలీవుడ్, యూరోపియన్ సినీ తారలు వచ్చి, గ్లామర్ అద్దుతారు. మన భారతీయ అందాల తార ఐశ్వర్యా రాయ్ గత పదిహేనేళ్లుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె కాన్స్ సాక్షిగా ఆ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆ పని మీదే ఆమె వెళుతున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఐష్ అక్కడ సినీ ప్రముఖులందరూ నడచి వచ్చే ఎర్ర తివాచీపై మెరవనున్నారు.
♦ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ దాదాపు మూడేళ్లుగా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది కూడా అక్కడివారిని అలరించనున్నారు. ఐష్ ఏ ఉత్పత్తిని అయితే ప్రమోట్ చేస్తారో సోనమ్ కూడా దాన్నే ప్రమోట్ చేయనున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్లోనే ఉన్నారు. మీడియా సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. 15, 16 తేదీల్లో రెడ్ కార్పెట్ నడకకు రెడీ అవుతున్నారు.
♦ కొన్నేళ్లుగా మల్లికా శెరావత్ కూడా కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఆ సమయంలో తాను పనిచేస్తున్న సినిమాను ప్రమోట్ చేస్తుంటారామె. ఈసారి హాలీవుడ్ చిత్రం ‘టైమ్ రైడర్స్’ కోసం ఆమె కాన్స్ వెళ్లారు. హాంగ్కాంగ్ దర్శకుడు డేనియెల్ దర్శకత్వంలో ఆమె నటించిన ఈ చిత్రం ప్రదర్శనకు అర్హత పొందింది.
♦ భారతీయ చిత్రాల్లో దూసుకెళుతున్న బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ కూడా రెడ్ కార్పెట్పై కనువిందు చేస్తారు.
♦ ‘ది స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రిదా పింటో 15న కాన్స్లో పాల్గొని, మహిళల సహాయార్థం ‘వియ్ డూ ఇట్ టుగెదర్’ పతాకంపై తాను నిర్మించనున్న చిత్రాల గురించి వివరించనున్నారు.