నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ ప్రభంజనం, చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలను ప్రజలు నమ్మటంతో రాష్ట్రంలో ఎన్నికలపై ప్రభావం చూపాయన్నారు.
తీర్పును మనస్పూర్తిగా అంగీకరిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. తమపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు జగన్ అభినందనలు తెలిపారు.
ఐదేళ్ల తర్వాత తిరిగి సత్తా చాటుతాం
అయిదేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎంపీలు, 17మంది ఎమ్మెల్యేలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం తమ బలం 70 మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎంపీల వరకూ పెరిగిందని జగన్ అన్నారు. మోడీ గాలి, బాబు అమలుకాని హామీలు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
మా పొత్తు ప్రజలతోనే
తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్ జగన్ స్ఫష్టం చేశారు. తమ పొత్తు ప్రజలతోనే అని ఆయన తెలిపారు. ప్రజల మనసులో నిలబడితే అదే పదివేలు అని జగన్ అన్నారు. ఈ అయిదేళ్లలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తాము పోరాడతామని జగన్ తెలిపారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడిందన్నారు. సమస్య ఎక్కడుంటే జగన్ అక్కడ ఉన్నారన్నారు. మళ్లీ కోలుకుని...అయిదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు. ప్రజల తరపున పోరాడటమే తమ లక్ష్యమన్నారు


