బాబోయ్.. చంద్రబాబా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు గాని, టీడీపీ పాలనగాని తలుచుకుంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు.
కాళ్ళ, న్యూస్లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు గాని, టీడీపీ పాలనగాని తలుచుకుంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. బాబోయ్ చంద్రబాబా.. ఆరోజులు మాకొద్దు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న పలువురు ఉద్యోగులు చంద్రబాబు, మహానేత వైఎస్సార్ పాలనలను బేరీజు వేసుకుంటూ ఓటు వేస్తున్నట్టు సమాచారం. అర్థం పద్దంలేని కార్యక్రమాలతో తమను వేధించిన చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికే మా మద్దతు అంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చంద్రబాబు పేరు చెబితేనే మండిపడుతున్నారు. చంద్రబాబు ఉద్యోగులను కాల్చుకుతిన్నాడ ని.. ఇంకుడు గుంటలంటూ తమకు సంబంధం లేని పను లు చెప్పి మానసిక వేదనకు గురిచేశారని వాపోతున్నారు.
పంచాయతీలకు అధికారాలు పెద్దాయన చలవే..
గ్రామస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ పాలనను వేరుచేసి ఉద్యోగావకాశాలు పెరగడంతోపాటు గ్రామీణులకు సులభంగా సేవలందించే ఏర్పాటు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేశారని ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. కొన్ని ధ్రువీకరణ పత్రాలను జారీచేసే అధికారం పంచాయతీలకు కల్పించడంతో పాలనా సౌలభ్యంతోపాటు రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడిందని అంటున్నారు.
కార్మికులకు వైఎస్ పెద్దపీట
ఐటీ అంటూ ఊరేగి హైటెక్ బాబుగా పేరుతెచ్చుకున్న చంద్రబాబునాయుడు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. బాబు పాలన లో విద్యుత్ చార్జీలు పెంచడంతో పలు చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని అంటున్నాయి. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పించి ప్రోత్సహించారని కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. ఇలా ఉద్యోగ, కార్మికుల ను నానా తిప్పలు పెట్టిన చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తా మంతా ఓటేస్తామని, తమ కుటుంబ సభ్యు లు, బంధువులతో కూడా ఓట్లేయిస్తామని ఉద్యోగులు, కార్మికులు అంటున్నారు.


