'ఇక పిల్లలకు చంద్రన్న పేరు పెట్టాలేమో..!'
కిర్లంపుడి: కాపులకు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఓ లేఖలో కడిగిపారేశారు. తమ జాతి(బలిజ, ఒంటరి, తెలగ, కాపు) పిల్లలకు వారికి వరాలు కురిపించడం కాదని తమ అసలైన డిమాండ్ ను నెరవేర్చాలని చెప్పారు. తమను బీసీల్లో కలిపేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి ఇవ్వకుండా పక్కన పెట్టే ఆలోచన చేయొద్దని విన్నవించారు. ఈ విషయంలో మరో మాట వినబోమని.. రాజీ పడబోమని చెప్పారు. బ్యాంకుల్లో తమకు ఇస్తున్న రుణాలు రివ్యూ చేశారా అని నిలదీశారు.
ఎంత రుణం అడిగితే అంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయండని అడుగుతున్నారని.. అంత సొమ్మే ఉంటే బ్యాకుల్లో ముష్టి ఎత్తుకునే కర్మ తమకు ఎందుకని ప్రశ్నించారు. తమ జాతిలోని పేదవారికి ఇతర కులాల వారికి సెక్యూరిటీ కోరకుండా ఎలా ఇస్తున్నారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను చంద్రన్న కానుకల దండకం గురించి పత్రికల్లో చదివానని.. సహాయం పొందేవారికి మీ పేరు పెట్టుకోవాలనే ఆలోచన రావాలే తప్ప మీరే దానకర్ణుడిగా చెప్పుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ఆఖరికి తమ జాతి పేరు తీసేసి చంద్రన్న పేరు తగిలించుకోమంటారేమో అని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో పెట్టిన పిల్లలకు చంద్రన్న పేరు, ఉద్యోగుల నెల జీతాలకు చంద్రన్న జీతంలాంటి పేర్లు పెడతారేమో అని అన్నారు. ఇలాంటి ఆర్బాటాల్లో మునిగి అసలు సంగతి పక్కన పెట్టవద్దని సూచించారు.