పైలెట్లకు జెట్ఎయిర్వేస్ సంచలన ప్రతిపాదన
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్లైన్స్ జూనియర్ ర్యాంకింగ్ పైలెట్లను ఆదేశిస్తోంది. వ్యయాల కోతలో భాగంగా జెట్ ఎయిర్వేస్ ఈ ఆదేశాలు జారీచేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ నెల మొదట్లోనే ప్రతిపాదిత జీతం, వేతనాల కోతకు సంబంధించి ఆదేశాలు జారీచేస్తూ పైలెట్లకు లేఖలు రాసిందని తెలిసింది. జెట్ ఎయిర్వేస్ ఎక్కువగా నౌకాశ్రయం కార్యకలాపాలపై దృష్టిపెట్టడం, తమ నెట్వర్క్ను హేతుబద్దీకరణ చేసుకోవడం మూలాన ఇలాంటి చర్యలను తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆగస్టు నుంచి వేతన కోత ప్రతిపాదనలు అమల్లోకి రాబోతున్నాయని, ఎయిర్లైన్స్ ఈ నిర్ణయంతో దాదాపు 400 మంది పైలెట్లు వరకు ప్రభావితం కాబోతున్నారని తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జెట్ ఎయిర్వేస్ తలకుమించిన వ్యయాలతో సతమతమవుతోంది. మరోవైపు తక్కువ ధరల క్యారియర్స్ ఇండిగో, స్పైస్జెట్ నుంచి విపరీతమైన పోటీ నెలకొంటోంది. జెట్ఎయిర్వేస్ పాక్షికంగా యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఇతిహాద్ ఎయిర్వేస్కు చెందినది. ఆయిల్ రిచ్ గల్ఫ్ ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో రెవెన్యూలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేతన కోత చేపడుతోంది.