సర్కారీ ఆస్తులు తనఖా పెడదాం!
ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణ మాఫీపై విధివిధానాల పేరుతో నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కమిటీని నియమించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పుడు..
రుణ మాఫీ కోసం రూ. 25 వేల కోట్ల అప్పు చంద్రబాబు ప్రభుత్వ యోచన!
మాఫీని రూ. 25 వేల కోట్లకే పరిమితం చేసే వ్యూహం
నిధుల సమీకరణ మార్గాన్వేషణపై సుజనాచౌదరి అధ్యక్షతన కమిటీ
కమిటీలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజెస్ తదితర సంస్థలను తాకట్టు పెట్టే ఆలోచన
లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల సెక్యూరిటీలనూ విక్రయించే యోచన
ఇలా చేస్తే కేంద్ర నిధులు, గ్రాంట్లపై ప్రభావం ఉంటుందన్న అధికారులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణ మాఫీపై విధివిధానాల పేరుతో నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కమిటీని నియమించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పుడు.. రుణ మాఫీకి నిధుల సమీకరణకు మార్గాన్వేషణ కోసం మరో కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ రుణాల మాఫీ వల్ల ప్రభుత్వంపై పడే భారం తగ్గించుకోవడానికి మార్గాన్వేషణ కోసం ఇంత కాలం కోటయ్య కమిటీ పనిచేయగా.. ఇప్పుడు రుణ మాఫీకి నిధులు లేవని, వాటిని ఎలా సమకూర్చుకోవాలో సూచించడానికి ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. రుణ మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా సుమారు రూ. 25,000 కోట్ల వరకు అప్పు చేయాలని టీడీపీ సర్కారు యోచి స్తోందని.. ఇలాంటి ‘నిధుల సమీకరణ మార్గాల’ను అన్వేషిం చి నివేదించటానికి ఈ తాజా కమిటీని నియమించిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యుడిగా ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కన్వీనర్గా రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ వ్యవహరించనున్నారు.
కమిటీలతో కాలయాపన...: ఒకవైపు రైతులు వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించాల్సిన గడువు తీరిపోయి బ్యాంకర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. ఖరీఫ్ సీజన్ గడచిపోతూ అదను మించిపోతోంది. ఇంకోవైపు.. మళ్లీ వ్యవసాయం చేయటానికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. అధికారంలోకి రాగానే రైతుల రుణాలన్నిటినీ మాఫీ చేస్తానన్న బాబు అధికారం చేపట్టి నెల గడిచిపోయినా మాఫీ మాట మానేసి.. రుణాల రీషెడ్యూల్ రాగం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిలా మరో కమిటీని తెరపైకి తేవటం కాలయాపన కోసమేనన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అప్పు చేసి మాఫీ చేసే యోచన...:
రుణ మాఫీ కోసం నిధుల సమీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజెస్ కార్పొరేషన్తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టడం ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని టీడీపీ సర్కారు యోచిస్తున్నట్లు కూడా ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ పరిమితులు విధించడం ద్వారా రుణ మాఫీ భారాన్ని రూ. 25,000 కోట్ల లోపుకు తగ్గించి.. ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టటం ద్వారా చేసిన అప్పును బ్యాంకులకు చెల్లించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని పేర్కొన్నాయి. అలాగే లాభాల్లో ఉన్న మరికొన్ని సంస్థల సెక్యూరిటీలను విక్రయించాలని కూడా సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తంమీద రూ. 20,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల వరకూ అప్పులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని.. ఇందుకు ఏ ఏ మార్గాలున్నాయో సుజనా కమిటీ అన్వేషించనుందని ఆ వర్గాలు వివరించాయి.
ఆ అప్పులతో కేంద్ర నిధులపై ప్రభావం...
ఆయా సంస్థలను తాకట్టు పెట్టటం ద్వారా చేసిన అప్పులను.. ప్రతి ఏటా అసలు, వడ్డీతో కలిపి బడ్జెట్లో పొందుపరిచి ఐదేళ్లలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్న ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎంతవరకు సాధ్యపడుతుందన్నది ప్రశ్నార్థకమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. సంస్థలను తాకట్టు పెట్టడం ద్వారా చేసిన అప్పు కూడా తిరిగి చెల్లించేసరికి అది రాష్ట్ర బడ్జెట్లోకి వస్తుందని.. దీనివల్ల కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు, గ్రాంట్లపై ఆ ప్రభావం పడే అవకా శాలు ఉంటాయని అధికార వర్గాల భావన.


