పచ్చమీడియాకు పిచ్చెక్కింది! | Emerald media mad! | Sakshi
Sakshi News home page

పచ్చమీడియాకు పిచ్చెక్కింది!

May 8 2014 2:13 AM | Updated on Aug 20 2018 8:20 PM

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది.. ఈటీవీ ప్రసారాలతీరు. ‘బోడిగుండుకు బట్టతలకు ముడిపెడుతూ గుడివాడ సాక్షిపై విషం గక్కారు.

  • టీడీపీ డబ్బు పంచితే.. ‘సాక్షి’కి అంటగట్టిన తీరు
  •  ఫ్యాను ‘గాలి’ ఓర్వలేక తప్పుడు ప్రసారాలు
  •  విషం గక్కిన ఈటీవీ
  •  విస్మయం చెందిన ప్రజలు
  •  గుడివాడ, న్యూస్‌లైన్ : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది.. ఈటీవీ ప్రసారాలతీరు. ‘బోడిగుండుకు బట్టతలకు ముడిపెడుతూ  గుడివాడ సాక్షిపై విషం గక్కారు.  వాస్తవాలను మరుగునపెట్టి సాక్షి పత్రిక , వైఎస్సార్ సీపీకి ముడిపెట్టి అడ్డగోలుగా తప్పుడు ప్రసారాలు చేశారు. తగుదునమ్మా అంటూ ఈ తప్పుడు ప్రసారాన్ని ఆధారం చేసుకుని ‘పచ్చ’ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు  చేసిన తీరు గుడివాడలో ఆ పార్టీ అభాసుపాలవడానికి కారణమయ్యింది.  
     
    అసలేం జరిగిందంటే....

    గుడివాడ పట్టణంలోని  ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బుల  పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సాక్షి కార్యాలయం కిందనున్న ఒక ఖాళీ షాపును కేంద్రంగా చేసుకుని టీడీపీ నేతలు   డబ్బు పంపిణీ  ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన సాక్షి ప్రతినిధులు వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ దృశ్యాలను చిత్రీకరించడానికి విజయవాడ నుంచి వచ్చిన ఈటీవీ విలేకరి సాక్షి కార్యాలయం కింద జరుగుతుంది కాబట్టి   వైఎస్సార్‌సీపీ నేతలే డబ్బు పంచుతున్నారని పచ్చ ఛానల్‌లో ఊదరగొట్టాడు.

    ఎందుకలా ప్రసారం చేస్తున్నారని సాక్షి విలేకరులు అడిగితే‘ సాక్షి కార్యాలయం కింద టీడీపీ వారు డబ్బు పంచుతున్నారని టీవీలో వేస్తే జనం నమ్మరు కదండి?’అని చెప్పుకున్నాడు. ఇదే సమయంలో  ఎన్నికల అధికారులు అక్కడకు రావడంతో డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు పారిపోయారు. ఒకరిని  పట్టుకుని వారి వద్ద ఉన్న నగదును   స్వాధీనం చేసుకున్నారు. జనాన్ని నమ్మించటానికి తప్పుడు ప్రసారాలకు పాల్పడి సాక్షిపై ఈనాడుకు ఉన్న నైజాన్ని చాటుకున్నాడని ఆ సమీపంలోనే ఉండి విషయాన్ని గమనిస్తున్న పట్టణ ప్రజలు వ్యాఖ్యానించారు.   
     
    నిజం కాదని తెలిసినా ప్రసారం ఆపని తీరు..
     
    సాక్షి కార్యాలయం కింద టీడీపీ నేతలే డబ్బు పంచారని అధికారులు ధృవీకరించినా.....   ఈటీవీలో ప్రసారాలు మాత్రం ఆపలేదు. దీనికి తోడు  జరిగిన ఉదంతమే వక్రీకరణ అయితే...  పచ్చనేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పదేపదే ప్రసారం చేశారు. ఇదేమని ప్రశ్నించిన పట్టణవాసులతో... ‘జనం నమ్మాలంటే మేం ఇలానే ప్రసారం చేస్తామని ఆ ఛానల్ ప్రతినిధి చెప్పుకొచ్చాడు.’అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
     
    జనం దృష్టిని మరల్చేందుకేనా..
     
    డబ్బులిస్తామని తీసుకొచ్చి మొండిచేయి చూపారని ఆరోపిస్తూ  ఆగ్రహం చెందిన గుడివాడ పట్టణ వాసులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  ఈ విషయాలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే.. ఈటీవీ  ఇటువంటి తప్పుడు ప్రసారాలకు తెగబడిందని తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement